Templates by BIGtheme NET
Home >> Cinema News >> హైకోర్టులో కంగనాకు ఊరట…!

హైకోర్టులో కంగనాకు ఊరట…!


బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా బంగ్లాలో నిబంధలనకు విరుద్ధంగా కంగనా అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కంగనకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. అయితే ఇక తన కార్యాలయ కూల్చివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కంగనా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. అంతకంటే ముందే బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రక్రియను మొదలు పెట్టడం గమనార్హం. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కావాలనే కంగనా రనౌత్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చేశారని కంగనా సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబైలో కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే జారీ చేసింది. కూల్చివేతను ఆపాలని.. కంగనా దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా కంగనా అనుమతి లేకుండా కార్యాలయంలోకి ఎలా ప్రవేశించారని కార్పొరేషన్ అధికారులను కోర్టు ప్రశ్నించిందని తెలుస్తోంది. ఇందుకు గానూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఇక కంగనా రనౌత్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. కోర్టు ఉత్తర్వులు తమకు తాత్కాలికంగా ఊరట నిచ్చాయని కంగనా తరఫు లాయర్ రిజ్వాన్ సిద్దిఖీ పేర్కొన్నారు.