Templates by BIGtheme NET
Home >> Cinema News >> దిల్ రాజు నిర్ణయం సరైనదేనా…?

దిల్ రాజు నిర్ణయం సరైనదేనా…?


కరోనా దెబ్బకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఇక థియేటర్ ఓనర్స్ సైతం సినిమా రిలీజులు లేకపోవడంతో నష్టపోతున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కరోనా అదుపులోకి వచ్చేలా లేదని క్లారిటీ వచ్చేసింది. అందుకే విడుదలకు నోచుకోని సినిమాలన్నిటిని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యాయి. దీనిపై ఇప్పటికే థియేటర్స్ అసోసియేషన్ మరియు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ నుంచి ఇంతవరకు పెద్ద సినిమాలు ఏవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. కాకపోతే ఇప్పుడు లేటెస్టుగా నాని కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ‘వి’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీతో భారీ డీల్ సెట్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

నాని – సుధీర్ బాబు – నివేద థామస్ – అదితి రావ్ హైదరి వంటి స్టార్స్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న ‘వి’ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ ని కూడా క్లోజ్ చేశాడు. ఈ క్రమంలో మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం మొబైల్ స్క్రీన్ మీద చూసే సినిమా కాదని.. థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా అని.. విజువల్ ఎఫెక్ట్స్ మరియు సౌండ్స్ థియేటర్స్ లోనే చూస్తూనే మంచి అనుభూతి కలుగుతుందని మేకర్స్ చెప్తూ వచ్చారు. నాని – అదితి రావ్ హైదరి సైతం పలు ఇంటర్వ్యూలలో ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా దిల్ రాజు ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయడానికి సిద్ధపడి అందరికి షాక్ ఇచ్చాడు. హీరో నాని తన కెరీర్ లో మైలురాయి 25వ చిత్రం కనుక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ సైతం తన పంధా మార్చి అత్యున్నతమైన సాంకేతిక నిపుణులతో వర్క్ చేయించుకున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ దక్కుతుందని ఆశ పడ్డారు. అయితే ఇప్పుడు దిల్ రాజు డెసిషన్ అందరి ఆశల్ని అడియాసలు చేసింది.

కాగా స్వతహాగా థియేటర్స్ కలిగిఉన్న దిల్ రాజు ఇలా థియేటర్ రిలీజ్ ని కాదని డిజిటల్ రిలీజ్ కి సిద్ధపడటం థియేటర్ల వ్యవస్థని కూడా షాక్ కి గురయ్యేలా చేసింది. ఇప్పటికే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఓనర్స్ నస్టపోతున్నామని ఆందోళన చెందుతున్న క్రమంలో దిల్ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఎంతైనా ఆయన కూడా ఓ నిర్మాతే అని.. ఇప్పటికే మూవీకి పెట్టిన పెట్టుబడి స్టక్ అయిపోయిందని.. రోజులు గడిచే కొద్దీ కంటెంట్ కూడా ఓల్డ్ అవుతుందని.. ఒకవేళ థియేటర్స్ తెరిచినా ఒకప్పటిలా ప్రేక్షకులకు వస్తారన్నది అనుమానమే.. అందుకే దిల్ రాజు ఇలాంటి ఆలోచన చేసి ఉంటాడు అనేవారు కూడా లేకపోలేదు. మరి ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే థియేటర్స్ మీద రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.