ఫక్తు కమర్షియల్ సినిమాలతో వినోదం పంచడంలోనే కాదు దేశభక్తిలోనూ పూరీకి సరిలేరు ఎవ్వరూ. ఆయన సినిమాల్లో డైలాగులు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనను తన సినిమాల్లో కనబరుస్తుంటారు పూరి. వాణిజ్య పంథా సినిమాల్లో సందేశాలు ఇవ్వకపోయినా వ్యక్తిగతంగా సామాజిక మార్పును కోరుకునే వారిలో పూరి ముందు వరుసలోనే ఉంటారు.
గత కొంతకాలంగా పాడ్ కాస్ట్ (డిజిటల్ ఆడియో)లో పూరి తనదైన బాణీతో దూసుకుపోతున్నాడు. పూరి జగన్నాథ్ పాడ్ కాస్ట్ చానెల్ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. పూరి సెలెక్షనే ఎక్స్ క్లూజివ్. తరచూ ఒక క్రొత్త అంశాన్ని ఎంచుకుంటాడు. దానిపై తన వ్యక్తిగత అభిప్రాయాలను నిర్మొహమాటంగా సూటిగా వ్యక్తం చేస్తున్నాడు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన పూరీ తాజా కాన్సెప్ట్ `మేరా భారత్ మహన్` సోషల్ మీడియా ల్లో అద్భుతంగా వైరల్ అవుతోంది. విశేషమేమిటంటే.. దాదాపు130 దేశాలలో ప్రజలు పూరి వినిపించిన `మేరే భారత్ మహన్` పాడ్ కాస్ట్ వింటున్నారు. ఇది ఒక రకంగా సిసలైన సక్సెస్ అనే చెప్పాలి. పూరి పాడ్ కాస్ట్ సిరీస్ ప్రపంచంలోని టాప్ 200 ప్రదర్శనలలో 9వ స్థానంలో ఉంది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే విషయం ఏమిటంటే.. పూరి వినిపించే విభిన్నమైన బాణీ సెలబ్రిటీల్ని హీరోల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ సైతం పూరీపై ప్రశంసలు కురిపించారు. పూరి పాడ్ కాస్టులకు స్పందన అద్భుతంగా ఉంది.
ఇక కెరీర్ సంగతి చూస్తే.. విజయ్ దేవరకొండ `ఫైటర్` చిత్రీకరణ వాయిదా పడడంతో.. అన్ లాక్ టైమ్ లో తదుపరి ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కథల్ని రెడీ చేస్తున్నారు పూరి. అలాగే వెబ్ సిరీస్ లకు కథలందించి శిష్యులకు అవకాశాలు కల్పించి వాటిని తనే స్వయంగా నిర్మిస్తున్నారు.