సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులు నిలకడగానే ఉన్న ఆయన ఆరోగ్యం తాజాగా విషమించింది. ప్రస్తుతం ఎస్పీ బాలు పరిస్థితి కరోనాతో విషమంగా మారడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజాగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.మరో రెండు రోజుల పాటు బాలసుబ్రహ్మణ్యంను ఐసీయూలోనే ఉంచుతామని వైద్యులు తెలిపారు.ఆయన త్వరగా కోలుకోవాలని ప్లాస్మా అందించామని.. మరో రెండు రోజులు వెంటిలేటర్ పైనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. చికిత్సకు ఎస్పీ బాలు బాగా స్పందిస్తున్నారని చెప్పారు.
ఇక ప్రముఖ గాయకుడైన ఎస్పీ బాలుకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఆసుపత్రి ఖర్చులన్నీ తామే భరిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. బాలు ఆరోగ్యపరిస్థితిని మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు.
ఇక తాజాగా ఎస్పీ బాలు సతీమణి సావిత్రికి కూడా కరోనా వైరస్ సోకిందని తేలింది. బాలుకు పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా సావిత్రికి పాజిటివ్ గా తేలింది.దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.