Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎన్టీఆర్ పైనే రాజకీయాలా..? ఖబడ్ధార్ అంటూ వార్నింగ్!

ఎన్టీఆర్ పైనే రాజకీయాలా..? ఖబడ్ధార్ అంటూ వార్నింగ్!


అన్నగారు ఎన్టీఆర్ అంటే చెవి కోసుకుంటారు వైవియస్ చౌదరి. మీడియా సమావేశాల్లో అన్నగారి పేరు తలవనిదే ఆయన ఉపన్యాసం అస్సలు సాగదు. అంతగా తారకరాముడిని ఆరాధిస్తారు వైవియస్. ఎన్టీఆర్ కుటుంబ హీరోలంటే ఎంతో లాయల్ గా ఉండే వైవియస్ హరికృష్ణ- బాలకృష్ణలతోనూ సినిమాలు చేశారు. అలాగే ఆయన మెగా హీరోలతోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ కుటుంబం నుంచి సుప్రీం హీరో సాయి తేజ్ ని హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే.

వై.వి.ఎస్ చౌదరి ఇటీవల కెరీర్ పరంగా కలిసిరాక సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ జోలికి వస్తే ఆయన రంగంలోకి దిగి దానిని ఖండించడం తెలిసినదే. ఈసారి దివంగత ఎన్టీఆర్ సమాధి చుట్టూ సాగుతున్న రాజకీయాల్ని తీవ్రంగా గర్హిస్తున్నానని అన్నారు. చౌదరి తన బాధను తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పేజీలో భావోద్వేగ పూరితమైన సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. కొందరు రాజకీయ నాయకులు రాజకీయాలను తమ వ్యాపారంగా చేసుకున్నారు. ప్రజలను రెచ్చగొట్టే.. నిగ్రహాన్ని ధ్వంశం చేసే వ్యూహాలపై వారు బతికేస్తారని చౌదరి అన్నారు. ఎన్టీఆర్ సమాధిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులు `అవకాశవాదులు` అని ఆరోపించారు. ఎందుకంటే వారు పోరాడుతున్న పార్టీతో నెక్సస్ లింకులను కలిగి ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు సమయం సందర్భాన్ని బట్టి తమ ప్రయోజనాలకనుగుణంగా మాట్లాడుతారని ఆయన అన్నారు. ఇలాంటి నాయకులపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని చౌదరి ‘ఖబడ్ధార్’ అన్నారు.

ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దివంగత ఎన్టీఆర్.. దివంగత పివి నరసింహారావు సమాధులపై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. పాలక టిఆర్.ఎస్ వారి సమాధులను కూల్చివేయాలని ఆయన సవాలు చేశారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. “హుస్సేన్ సాగర్ 4700 ఎకరాలలో విస్తరించి ఉంది. నేడు అది 700 ఎకరాలు కూడా కాదు. హైదరాబాద్ లో నిర్మాణాలను కూల్చివేస్తామని టిఆర్.ఎస్ ప్రభుత్వం చెబుతోంది. అలా అయితే.. వారు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పివి నరసింహారావు.. ఎన్టీఆర్ సమాధులను కూడా పడగొట్టాలి ” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్ ఒవైసీపై స్పందిస్తూ మంత్రి కెటిఆర్ వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు సినీప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు.