Templates by BIGtheme NET
Home >> Cinema News >> రజినీకాంత్‌ను బీట్ చేసిన ప్రభాస్!

రజినీకాంత్‌ను బీట్ చేసిన ప్రభాస్!


ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడో రికార్డ్ సృష్టించారు. అందరి హీరోల మాదిరిగా కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా లాభాల్లో రజినీ వాటా తీసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయన రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంటుందని చెబుతుంటారు. చైనా యాక్షన్ హీరో జాకీచాన్ కన్నా అధిక మొత్తంలో రజినీ పారితోషికం తీసుకుంటారని ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట. అయితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రజినీకాంత్‌ను దాటేశారట.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మాతగా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 21వ సినిమా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కథానాయిక. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు ప్రభాస్ రూ. 100 కోట్లు అందుకోనున్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ రూ.70 కోట్లు, డబ్బింగ్ రైట్స్ రూ.30 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.100 కోట్లు తీసుకుంటున్నారట ప్రభాస్.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరో ఇంత మొత్తంలో ఒక సినిమాకు అందుకోలేదు. ‘దర్బార్’ సినిమాకు రజినీకాంత్ అత్యధికంగా రూ.70 కోట్లు అందుకున్నట్టు తమిళ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతేకాదు, ఇప్పటి వరకు రజినీకాంత్‌ అందుకునేదే అత్యధికం. ఇన్నేళ్ల తర్వాత ఆ రికార్డును ప్రభాస్ బ్రేక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్‌కే రూ.100 కోట్లు ఇస్తుంటే.. ఇక సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’తో బిజీగా ఉన్నారు. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఆగింది. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించనున్నారు. కథ చాలా వరకు యూరప్‌లోనే నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ రెండు షెడ్యూళ్లను పూర్తిచేసింది. ఈ చిత్రాన్ని యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు.