ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే కలికాలమిది. ఆదమరిస్తే ఇల్లు ఒళ్లు గుల్లే. ఏమరపాటుగా వుంటే మనకు తెలియకుండానే మనల్నే అమ్మేస్తారు. డీప్ గా ఆరా తీస్తే ప్రతీ వాడూ దొంగే అన్నట్టుగా వుంది ప్రస్తుత పరిస్థితి. తాజాగా ఫేమస్ హీరోయిన్ కి జరిగిన మోసం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక మాజీ సీఎం సతీమణి రాధికా కుమార స్వామికే ఏకంగా 3 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఓ వీడియో షేరింగ్ వెబ్ సైట్ రాధికా కుమారస్వామి నటించిన చిత్రాన్ని ఆమె అనుమతి లేకుండానే అప్ లోడ్ చేసి షాకిచ్చింది.
విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సదరు యూట్యూబ్ చానల్ పై న్యాయ పరంగా చర్యలు తీసుకోవడానికి రాధికా కుమారస్వామి సిద్ధమవుతున్నారు. కన్నడలో రాధికా కుమారస్వామి `స్వీటీ నాన్న జోడీ` (2013) అనే చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్ర డిజిటల్ హక్కులు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది సినిమా మొత్తాన్ని ఎలాంటి హక్కులు పొందకుండా ఓ యూట్యూబ్ చానల్ అప్ లోడ్ చేసింది.
విషయం తెలుసుకున్న రాధిక వెంటనే రియాక్ట్ అయ్యింది. తనకు 3 కోట్లు కు కుచ్చుటోపీ పెట్టిన సదరు చానల్ పై చట్టపరమైన చర్యలకు దిగుతోంది. ఈ విషయంపై బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఐదేళ్ల విరామం తరువాత రాధిక చేసిన చిత్రమిది.