లాక్ డౌన్ చాలా చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తోంది. ముఖ్యంగా పెళ్లాడాలా వద్దా? ఈ బిజీ లైఫ్ లో అది అవసరమా? అనుకునే చాలామంది సెలబ్రిటీ బ్యాచిలర్ల మనసు మార్చేసింది. అందుకే ఇటీవల వరుసగా టాలీవుడ్ లో పెళ్లిళ్లు మోతెక్కిపోతున్నాయ్.
నిఖిల్.. నితిన్ .. రానా.. లాంటి స్టార్లు ఓ ఇంటివాళ్లయ్యారు. జబర్దస్త్ మహేష్ పెళ్లయ్యింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం జరుపుకున్నారు. డిసెంబర్ లో పెళ్లి ఉంటుంది. సందీప్ కిషన్ కి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చేయగా త్వరలోనే ఆ సంగతిని ప్రకటించనున్నాడు. ప్రభాస్.. శర్వానంద్ లాంటి వాళ్లకు ఓ క్లారిటీ వస్తే బావుంటుందనేది అభిమానుల ఆశ.
ఈలోగానే ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు.. నటుడు రాజా చెంబోలు తన నిశ్చితార్థం పూర్తయిందని శనివారం సోషల్ మీడియాలో తెలిపారు. వధువు ఎవరు? అన్నది మాత్రం ఆయన తెలపలేదు. నిశ్చితార్థ ఫోటోని అభిమానులకు షేర్ చేసిన రాజా .. కొత్త జీవితాన్ని మొదలు పెట్టేందుకు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నానని తెలిపాడు. 2020 తన లైఫ్ లోనే బెస్ట్ అని అన్నాడు. ఫిదా- నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా-హ్యాపీ వెడ్డింగ్-అంతరిక్షం-మిస్టర్ మజ్ను-రణరంగం తదితర చిత్రాల్లో రాజా నటించారు. మస్తీ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ వేదికపైనా అదృష్టం పరీక్షించుకున్నారు. రాజా తర్వాత నిశ్చితార్థం బహుశా సందీప్ కిషన్ దే అయ్యి ఉంటుంది. నెక్ట్స్ ఎవరు? అన్నది కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.