బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన పూరి జగన్నాద్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా మెహబూబా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని ‘రొమాంటిక్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని పూరి నిర్మిస్తూ ఉండగా అనీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో ఆకాష్ కు ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ సక్సెస్ అందించాలనే పట్టుదలతో పూరి జగన్నాధ్ ఉన్నాడు. అందుకే కథ నుండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తాడో పేడో తేలిపోయేది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమాను ఆమద్య ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన సీన్స్ ను రీ షూట్ చేయడంతో పాటు కొన్ని కొత్త సీన్స్ ను కూడా యాడ్ చేయాలని పూరి నిర్ణయించాడట.
కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో పూరి రాజీపడకుండా ఈ రీషూట్ కు ఆదేశించారని తెలుస్తోంది. దర్శకుడు అనీల్ అందుకు సిద్దం అవుతున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన రీ షూట్ పనులు మొదలయ్యే అవకాశం ఉందట. సినిమాను ఈ ఏడాది చివరి వరకు థియేటర్ లో లేదా ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.