మహమ్మారీ విజృంభణ టాలీవుడ్ నిర్మాతల ఫేట్ మార్చేస్తోంది. సాధ్యమైనంత తొందర్లోనే వ్యాక్సిన్ లేదా టీకా వచ్చేస్తుందనే ఆశావహ ధృక్పథంతో ఇన్నాళ్లు చాలామంది ఓటీటీ ల్లో సినిమాల్ని రిలీజ్ చేసేయకుండా ఆపి ఉంచారు. థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూసారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. వేచి చూసినా ఫలితం ఉండేట్టు లేదు. దీంతో ఆలోచన మారుతోంది. ఓటీటీ వేదికలైన అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ .. జీ5 వంటి సంస్థలతో బేరసారాలు సాగిస్తూ మంచి ధర పలికినప్పుడు రిలీజ్ చేసేందుకు వెనకాడడం లేదు.
ఇటీవలే నానీ-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇంద్రగంటి దర్శకుడిగా దిల్ రాజు నిర్మించిన `వీ` చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారని ప్రచారమైంది. ఈ మూవీ కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లిస్తోందని వార్తలొచ్చాయి. తాజాగా మరో మూడు నాలుగు సినిమాలు డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.
ఇందులో ముఖ్యంగా కీర్తి సురేష్ నటించిన `మిస్ ఇండియా`.. సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` సినిమాలు ఉన్నాయి. ఒకరు నెట్ ఫ్లిక్స్ తో.. ఇంకొకరు జీ5తో బేరసారాలు సాగిస్తున్నారని డీల్ ఫైనల్ అయిపోయినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే సుప్రీం హీరోకి ఇది తొలి డిజిటల్ రిలీజ్ కాగా.. కీర్తి సురేష్ కి రెండో సినిమా. ఇంతకుముందు కీర్తి నటించిన థ్రిల్లర్ మూవీ `పెంగ్విన్` డిజిటల్లో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల కోసం నిర్మాతలు నానా వ్యయప్రయాసలకు ఓర్చారు. ఆ మేరకు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించేందుకు ఓటీటీ సంస్థలు అంగీకరించాయా? అన్నదే ఇప్పటకీ సస్పెన్స్. ఓటీటీల్లో సరైన చెల్లింపులు లేకపోవడం వల్లనే ఇన్నాళ్లు ఆగారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.