Templates by BIGtheme NET
Home >> Cinema News >> వెంకయ్య ట్వీటేశారు! శర్వాకి జాతీయ అవార్డు ఖాయం!!

వెంకయ్య ట్వీటేశారు! శర్వాకి జాతీయ అవార్డు ఖాయం!!


మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ట్వీట్లు వేయడం ప్రోత్సహంచడం భాజపా సీనియర్ నాయకుడు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అలవాటు వ్యాపకం. ఆయన ఇంతకుముందు రైతాంగం.. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన `మహర్షి` చిత్రానికి ట్వీట్ వేసి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు వదిలారు. వ్యవసాయం నేపథ్యంలో చక్కని సినిమా తీశారని యువతరం చూడాలని అన్నారు.

వెంకయ్య ట్వీట్ల సారాంశం ఇలా ఉంది. “వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు నటీనటులకు శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి వ్యవసాయంతో జోడించి పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు! అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం“ అంటూ ట్వీట్ చేశారు.

అయితే దీనికి అభిమానుల రిప్లయ్ లు అంతే ఘాటుగా ఉన్నాయి. “నిజ జీవితంలో సీన్ వేరే ఉంది. వ్యవసాయం చేసే రైతులకు తోడ్పాటు లేదు సార్. పంట నష్టం వచ్చి మళ్ళీ పంట వేయాలంటే దిక్కుతోచని పరిస్థితి. వ్యవసాయంలో అప్పుల పాలు అయితే అండగా ఆదుకునేవారు లేరు. అప్పు తెచ్చి వేరే పంట వేస్తే పాత అప్పులు తిర్చటానికి కూడా రాని ధర. ఇంకా రైతు రాజు ఎప్పుడు అవుతాడు?“ అంటూ ప్రశ్నించారు ఒక అభిమాని.

వేరొక ఔత్సాహిక అభిమాని ఏమన్నారంటే.. “మహర్షి (మహేష్ మూవీ) కోసం గతంలో ఇలానే ఒక ట్వీట్ వేసార్ సర్ మీరు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు.. ఇప్పుడు దీనిమీద కూడా ట్వీట్ వేసారు … నెక్ట్స్ నేషనల్ అవార్డు ఖాయం!“ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

నిజమే నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మహర్షికి ఓ రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అది వెంకయ్య ఘనతే అనుకుంటే.. శర్వా శ్రీకారంపైనా ట్వీట్లు వేసినందుకు జాతీయ అవార్డులు గ్యారెంటీ అన్నమాట!! అయితే రైతు రాజు అయ్యేదెపుడో ఉపరాష్ట్రపతి వెంకయ్య సర్ స్పష్ఠతనివ్వాల్సి ఉంటుంది.