Templates by BIGtheme NET
Home >> Telugu News >> కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం … క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం … క్లారిటీ ఇచ్చిన కోదండరామ్


తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి తొలుత పార్టీ బలోపేతం పై ఎక్కువ ఫోకస్ చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ముందుకువెళ్తేనే కాంగ్రెస్ బలపడుతుందని భావించారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఆ తరువాత సొంతంగా తెలంగాణ జనసమితి అనే పార్టీని స్థాపించిన కోదండరామ్.. ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ కాలేకపోయారు. ఆ తరువాత సొంత పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్న కోదండరామ్ టీఆర్ ఎస్ వ్యతిరేక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు. సొంత పార్టీ ద్వారా రాణించలేకపోతున్న కోదండరామ్ పార్టీని కాంగ్రెస్ లో లో విలీనం చేస్తారంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఈ వార్తలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం క్లారిటీ ఇచ్చారు. గతంలో జేఏసీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం నిజమేనని అన్నారు. కానీ టీజేఎస్ ను విలీనం చేసేదీలేదని అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. విలీనానికి సంబంధించి రెండుపార్టీల మధ్య ఎటువంటి చర్యలు జరగలేదని తేల్చి చెప్పారు. త్వరలో హుజూరాబాద్ లో జరుగబోయే ఉప ఎన్నికలో బరిలో పోటీ చేయాలా వద్దా అనే విషయాల గురించి నిర్ణయం తీసుకుంటానని కోదండరాం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీజేఎస్ కీలక ప్రాత పోషించిందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాలు చేసిందని కోదండరాం అన్నారు. ప్రజా సమస్యలపై ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం తప్ప.. తమ ఆస్థిత్వాన్ని కోల్పోయేది లేదని స్పష్టం చేశారు.