Templates by BIGtheme NET
Home >> Telugu News >> విజయవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

విజయవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ


విజయవాడలోకి కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ట్వీట్ చేసింది. ఈ మేరకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఈ నిధులను విడుదలు చేసింది. ఇక ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, విజయవాడలోని ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా సమీపంలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10మంది దుర్మరణం చెందారు. అలాగే ఆస్పత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. విజయవాడ ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నానని, తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. ప్రధాని ట్వీట్ చేసిన కొన్ని గంటల్లో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాడపడ్డ వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది.