Templates by BIGtheme NET
Home >> Telugu News >> కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..

కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..


జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టింది బీజేపీ. టీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ ను లాగేసి గట్టి షాకిచ్చింది. తాజాగా టీఆర్ఎస్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు ఉద్యమకారుడు స్వామి గౌడ్ గులాబీ బాస్ కు గట్టి షాకిచ్చాడు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు రాత్రి స్వామి గౌడ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఢిల్లీలో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడివి హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఆయన కామెంట్ చేసినట్టు దుమారం రేపుతున్నాయి.

ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా కేసీఆర్ ఇవ్వలేదని.. రెండేళ్లుగా ఓపిక పెట్టి సహనం నశించి బీజేపీలో చేరానని స్వామి గౌడ్ అన్నారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని.. టీఆర్ఎస్ లో తన ఆత్మాభిమానం చంపుకోలేక ఇలా చేరానని స్వామి గౌడ్ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నాడని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకొని ఉద్యమకారులను తొక్కేస్తున్నాడని స్వామి గౌడ్ ఆరోపించారు. ఆత్మాభిమానం చంపుకోలేకే బీజేపీలో చేరానని వివరించారు.

తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ గా స్వామిగౌడ్ చేశారు. ఐదేళ్లు పూర్తి కావడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు. కేసీఆర్ తొలిగినప్పటి నుంచి స్వామి గౌడ్ టీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు. కేసీఆర్ ఆయనకు పదవిని రెన్యువల్ చేయలేదు. ఈ క్రమంలోనే స్వామి గౌడ్ తాజాగా బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని స్వామి గౌడ్ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు..కేసీఆర్ కు ఈ పరిణామం షాకింగ్ గా మారింది.