Templates by BIGtheme NET
Home >> Telugu News >> టీ కోర్టు ఘాటు వ్యాఖ్య.. ఇదేం నిజాం రాజ్యం కాదంటూ..

టీ కోర్టు ఘాటు వ్యాఖ్య.. ఇదేం నిజాం రాజ్యం కాదంటూ..


ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఔట్ సోర్సింగ్ సేవల మీద తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. నిరంతరంగా సాగే పనులకు సైతం ఔట్ సోర్సింగ్ సేవల్ని తీసుకోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టటమే కాదు.. ఇదేం నిజాం రాజ్యం కాదంటూ ఘాటు వ్యాఖ్య చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ హైకోర్టు ఎందుకింత తీవ్రంగా స్పందించింది అన్న విషయంలోకి వెళితే..

పని ఏదైనా.. ఉద్యోగుల్ని శాశ్విత ప్రాతిపదికన నియామకం జరపకుండా ఔట్ సోర్సింగ్.. కాంట్రాక్టు కార్మికుల్ని నియమించుకోవటం ప్రభుత్వ శాఖల్లో అంతకంతకూ పెరుగుతోంది. చివర కు కీలకమైన శాఖలు.. పనుల విషయంలోనూ ఇదే తీరును ప్రభుత్వం పాటిస్తుంది. వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న కార్మికులను క్రమ బద్ధీకరించి.. వేతన బకాయిల్ని చెల్లించాలంటూ ఆగస్టు ఏడున సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జీహెచ్ఎంసీ అప్పీలు దాఖలు చేసింది.

దీనికి సంబంధించిన విచారణ సాగుతున్న సమయం లో మంజూరైన పోస్టులు లేవని.. శానిటరీ తదితర పనుల్ని కాంట్రాక్టర్ల కు అప్పగించినట్లుగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కోర్టు కు చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం పర్మినెంట్ పోస్టుల్ని ఎందుకు క్రియేట్ చేయటం లేదెందుకు? అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ న్యాయవాది మాట్లాడుతూ.. పర్మినెంట్ ఉద్యోగులు 5 వేల మంది ఉన్నారని.. ఔట్ సోర్సింగ్ కింద సుమారు 30 వేల మంది ఉన్నారని.. వారందరికి రెగ్యులర్ వేతనాలు చెల్లించాలంటే ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇలాంటి వ్యవహారాల్లో ఆర్థిక భారం పడుతుందని చెప్పకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ శానిటరీ సూపర్ మైజర్స్.. శానిటేషన్ కార్మికులు.. ఎంటమాలజీ ఫీల్డ్ వర్కర్లు.. ఎంటమాలజీ సుపీరియర్ ఫీల్డ్ వర్కర్లు.. సూపర్ వైజర్లు.. సుపీరియర్ ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించిన ఎన్ని పోస్టులు మంజూరైన వివరాల్ని అందించాలని కోరింది.

ఔట్ సోర్సింగ్ ద్వారా ఏళ్ల తరబడి సేవలు పొందటం శ్రమదోపిడీ తప్పించి మరొకటి కాదని స్పష్టం చేసింది. జనాభా గణన లాంటి వాటికి తాత్కాలిక ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ సేవలు తీసుకోవచ్చన్న కోర్టు.. శానిటేషన్ లాంటి నిరంతర పనులకు పర్మినెంట్ పోస్టులు ఎందుకు క్రియేట్ చేయరని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది. కోర్టు పుణ్యమా అని అయినా.. ఔట్ సోర్సింగ్ విధానానికి చెక్ పడితే.. ఉద్యోగుల శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందని చెప్పక తప్పదు.