Templates by BIGtheme NET
Home >> Telugu News >> దుబ్బాక రిజల్ట్ తర్వాత కేసీఆర్ స్పందన..

దుబ్బాక రిజల్ట్ తర్వాత కేసీఆర్ స్పందన..


తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క ఉప ఎన్నిక దుబ్బాక. దాని ఫలితం ఎలా వచ్చిందన్నది తెలిసిందే. కలలోకూడా ఊహించని రీతిలో దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పు అధికారపక్ష నేతల్ని మాత్రమే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబ్బాక ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత బీజేపీ స్వల్ప అధిక్యతలో ఉన్నా తుది ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని భావించారు. దీంతో.. నమ్మకంగా ఉన్నారు. కానీ.. వారి అంచనాలు తప్పు కావటం.. ఓటమి ఖాయం కావటంతో ఏం మాట్లాడలేని పరిస్థతి. ఫలితంపై స్పందించే విషయంలో ఎవరికి వారు మాటలు వెతుక్కునే దుస్థితి. నిజానికి ఇలాంటి పరిస్థితి టీఆర్ఎస్ కు కాస్త కొత్తనే చెప్పాలి.

తెలంగాణలో తమకు ఎదురులేదని.. తాను ఏది డిసైడ్ చేస్తే.. అదే అవుతుందన్న నమ్మకం అందరికి కంటే ఎక్కువగా కేసీఆర్ లో ఉండేది. కానీ.. అది కాస్తా దెబ్బగా మారటంతో ఇప్పుడు నోటమాట రాని పరిస్థితి. దుబ్బాక ఫలితం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉందన్న ఆసక్తి వ్యక్తమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తీవ్ర ఆగ్రహంతో పాటు.. విస్మయానికి గురైనట్లుగా చెబుతున్నారు.

తమ అంచనాలకు భిన్నంగా ఫలితం రావటంపై ఆయన గుర్రుగా ఉండటమే కాదు.. తనకు గెలుస్తారంటూ రిపోర్టులు ఇచ్చిన వారికి అక్షింతలు పడినట్లుగా చెబుతున్నారు. నిత్యం టచ్ లో ఉండి.. దుబ్బాకలో గెలుపు ఖాయమని చెప్పిన వారికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. వాస్తవాల్ని తెలుసుకునే విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్న విషయంపై ఆయన ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.

కౌంటింగ్ చివరకు వచ్చేసే వేళకు.. ఓడిపోయేటట్లు ఉన్నట్లుగా కేసీఆర్ గుర్తించినట్లు చెబుతున్నారు. ఫలితాల వెల్లడికి దాదాపు రెండు గంటల ముందే.. ఓటమిని కేసీఆర్ కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దుబ్బాకలో గెలుపు ఖాయమని చెబుతూ ఇచ్చిన నివేదికలు ఒక పక్క ఉంచుకొన్న కేసీఆర్.. అలాంటి రిపోర్టు ఎలా ఇచ్చారన్న ప్రశ్నను సంధించటంతో.. వాటిని ఇచ్చిన వారి నోటమాట రాని పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది.