Templates by BIGtheme NET
Home >> Cinema News >> సినీ దర్శకుడికి టోకరా.. ఫిల్మ్ ఫెస్ట్ లో సినిమా ప్రదర్శిస్తామని డబ్బులు దొబ్బేశారు..!

సినీ దర్శకుడికి టోకరా.. ఫిల్మ్ ఫెస్ట్ లో సినిమా ప్రదర్శిస్తామని డబ్బులు దొబ్బేశారు..!


మొదటి సినిమా ‘ఛలో’తోనే సూపర్హిట్ కొట్టి అటు ఇండస్ట్రీని ఇటు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఆ తర్వాత హీరో నితిన్తో ‘భీష్మ’ తెరకెక్కించి సక్సెస్ రిపీట్ చేశాడు. ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా.. ఈ సూపర్ హిట్ దర్శకుడికి కుచ్చుటోపీ పెట్టారు సైబర్ కేటుగాళ్లు. అది కూడా ఆయన సినిమా పేరు చెప్పి డబ్బులు దండుకోవడం గమనార్హం.

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ‘భీష్మ’ చిత్రాన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు నామినేట్ చేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానల్ లో సభ్యుడినని పరిచయం చేసుకున్నాడు. త్వరలో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భీష్మ’ చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్ చేస్తానని చెప్పాడు. దీనికిగానూ.. ఒక్కో కేటగిరీకి రూ.11 వేల చొప్పున చెల్లించాలని చెప్పాడు.

మరి ఈ మాటలను ఎలా విశ్వసించాడో తెలియదుగానీ.. వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి ఆరవై ఆరువేల రూపాయలను సదరు అగంతకుడు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే.. మర్నాడు అదే వ్యక్తి ఫోన్ చేసి.. మూడు నామినేషన్స్ విషయంలో పొరపాట్లు జరిగాయని వాటిని సరి చేయడానికి మరికొన్ని డబ్బులు డిపాజిట్ చేయాలని అడిగాడు.

దీంతో అనుమానం వచ్చిన వెంకీ.. తనకు నామినేషన్ ఏదీ అవసరం లేదని చెప్పాడు. ఆ తర్వాత విషయం ఆరాతీయగా.. తాను మోసపోయానని గుర్తించాడు. దీంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్శకుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ అకౌంట్ డీటెయిల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.