Templates by BIGtheme NET
Home >> Cinema News >> కంగనా ఆఫీస్ కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు

కంగనా ఆఫీస్ కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు


వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శించి కేసుల పాలైన బాలీవుడ్ నటి కంగనా రౌనత్ కు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను టార్గెట్ చేసింది కంగనా.. ఈ క్రమంలోనే ప్రతీకార చర్యగా ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేసింది.

దీనిపై హైకోర్టును ఆశ్రయించింది కంగనా రౌనత్. చట్టప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తాజాగా హైకోర్టు మండిపడింది. పిటీషనర్ కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని ముంబై మున్సిపాలిటీని ఆదేశించింది.

బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ కంగనా చేసిన న్యాయ పోరాటం ఫలించినట్టైంది. కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సుధీర్ఘ వాదనలు అనంతరం హైకోర్టు శుక్రవారం తుది తీర్పును ఇచ్చింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పోరాడి మొత్తానికి కంగనా గెలిచేసింది.

సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ హస్తం ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ అప్పట్లో నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి.. ఈ క్రమంలోనే ఆమె ఆఫీసు కూల్చివేత జరగడం.. తాజాగా దీనిపై హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ ఫైట్ లో కంగననే గెలిచినట్టైంది.