Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలు కోసం కేఏ పాల్ ప్రార్థనలు చేస్తున్నారట!

బాలు కోసం కేఏ పాల్ ప్రార్థనలు చేస్తున్నారట!


కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న కరోనా పాజిటివ్ రావడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఎక్మో ట్రీట్ మెంట్ ను అందిస్తూ వైద్యులు ఆయనను ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకునేలా యత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాలు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ లక్షలాది మంది పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా బాలు ఆరోగ్యం కుదుటపడాలని అంతర్జాతీయ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కూడా ప్రార్థనలు మొదలుపెట్టారట. ఈ మేరకు స్వయంగా కేఏ పాలే ఈ విషయాన్ని ప్రకటించారు.

బాలు త్వరితగతిన కోలుకోవాలని కేఏ పాల్ తన ప్రార్థనలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారట. ఈ సందర్భంగా పాల్ ఓ వీడియోను విడుదల చేశారు. సదరు వీడియోలో కేఏ పాల్ ఏమంటున్నారంటే… ‘‘ఫ్రెండ్స్ నేను ఉన్న దగ్గర పగలు.. బహుషా ఇండియాలో రాత్రి ఒకటి అయ్యి ఉంటుంది. అయితే సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయమని అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్పై ఉన్నారని.. ప్రాణం పోయే పరిస్థితికి వచ్చారని తెలిసింది. ఆయన శాంతి సందేశం లీడ్ సాంగ్ పాడారు. ఆ సందర్భంలో నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారాయన. 74 ఏళ్లు అయినప్పటికీ.. దేవుని చిత్తమైతే ఆయనకు మిరాకిల్ జరగాలి. ప్రాణం పోయే పరిస్థితిలో ప్రాణం పోయాలని మనం ప్రార్ధిద్దాం. ఒకవేళ దేవుని చిత్తమై ఆయన చనిపోతే దేవుని దగ్గరకు వెళ్లాలి.. స్వర్గానికి వెళ్లాలని ప్రార్థిద్దాం.. ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని తిరిగి పాటలు పాడాలని దేవుడు అద్భుత కార్యం జరిగించాలి’’ అంటూ కేఎ పాల్ చెప్పుకొచ్చారు.