తెర మీద విలనీని బ్రహ్మండంగా పండించే నటుడిగా కళాభవన్ మణి సుపరిచితుడు. తాజాగా ఆయన సోదరుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలంగా మారింది. దాదాపు నాలుగేళ్ల క్రితం కొచ్చిలో కళాభవన్ మణి అనుమానాస్పద స్థితిలో మరణించటం తలెిసిందే. ఆయన శరీరంలో విషం ఆనవాళ్లు ఉండటంతో అప్పట్లో ఆయన మరణం సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐకి అప్పగించినా.. ఇప్పటివరకు ఆయన చావు మిస్టరీ వీడలేదు.
తాజాగా ఆయన సోదరుడు ఆత్మహత్యాయత్నం చేయటం మరింతో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం
కేరళ సంగీత నాటక అకాడమీనే అంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోహినియట్టం కళాకారుడిగా సుపరిచితుడైన ఆర్.ఎల్.వీ రామకృష్ణన్ ఆత్మహత్యకు ప్రయత్నించటమా? అన్న సందేహం ఇప్పుడు వేధిస్తోంది. తన సూసైడ్ ప్రయత్నానికి కారణం కులం పేరుతో వేధింపులే అంటూ ఆయన రాసిన లెటర్ బయటకు రావటంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లైంది.
తనను ప్రదర్శనలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని.. అనుమతులు ఇవ్వటం లేదంటూ నాటక అకాడమీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. త్రిస్సూర్ లోని మణి స్మారక కేంద్రం వద్ద ఆపస్మారకంగా పడి ఉన్న అతడ్ని.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. గండం గట్టెక్కినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
మోహినియట్టం కళను ఎక్కువగా మహిళలు ప్రదర్శిస్తుంటారు. ఈ ఆర్ట్ ఫాంను పురుషులు అతి కొద్దిమందే ప్రదర్శిస్తుంటారు. రామకృష్ణన్ ప్రత్యేకత ఏమంటే.. మోహినియట్టంలో ఆయన పీహెచ్ డీ చేశారు. ఈ రంగంలో దాదాపు పదిహేనేళ్లు పరిశోధన చేసి డాక్టరేట్ ను సొంతం చేసుకున్నారు కూడా. అకాడమీలో వర్చువల్ ప్రదర్శనకు కేరళ సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ కేపీఏసీ లలిత అనుమతించినప్పటికీ కార్యదర్శి రాధాక్రిష్ణన్ నాయర్ అడ్డుకుంటున్నారన్నారు.
కులం పేరుతో తనను టార్గెట్ చేశారని.. ఆ టార్చర్ భరించలేకనే తాను సూసైడ్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రామకృష్ణన్ ఆరోపణల్ని కేరళ సంగీత అకాడమీ ఖండించింది. తాజా పరిణామాలపై న్యాయపోరాటం చేస్తామని రామకృష్ణన్ కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.