Templates by BIGtheme NET
Home >> Cinema News >> కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన

కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన


కంగన వర్సెస్ ముంబై మున్సిపాలిటీ ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాను ఎంతో శ్రమించి భారీగా ఖర్చు చేసి నిర్మించుకున్న ఆఫీస్ ని బీఎంసీ కుప్పకూల్చింది. అయితే కూల్చివేసిన కార్యాలయాన్ని పునర్నిర్మించేంత డబ్బు లేదని శిథిలాల మధ్యనే కూచుని ఆఫీస్ డ్యూటీ చేస్తానని చెప్పుకొచ్చింది క్వీన్.

ఆఫీస్ ని తిరిగి కట్టుకోలేను. స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ పని చేస్తున్నట్టుగా ప్రకటించింది. నిర్మాణాత్మక ఉల్లంఘనల ఆధారంగా బీఎంసీ ఈ ఆఫీస్ ని కూల్చివేసినా ఇదంతా శివసేన రాజకీయ కక్ష అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తన ఆఫీస్ ని కూల్చివేయడంపై కంగన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక ట్వీట్ లో దీనిని ప్రస్థావిస్తూ.. “నేను జనవరి 15 న నా కార్యాలయం ప్రారంభించాను. కరోనా వల్ల పని ఆగిపోయింది. సినిమాలు చేయడం లేదు. అందుకే దాన్ని పునరుద్ధరించడానికి డబ్బు లేదు. నేను అక్కడి నుండి పని చేస్తాను. శిథిలమైన ఆ కార్యాలయంలో పని చేసేందుకు ఈ ప్రపంచంలో ధైర్యం చేసిన స్త్రీల ఇష్టానికి చిహ్నంగా మారతాను“ అంటూ ఆవేశ పూరితంగా ప్రతినబూనింది క్వీన్. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని వ్యతిరేకిస్తూ.. “కంగనా వర్సెస్ ఉద్దవ్” అనే హ్యాష్ ట్యాగ్ ను ఆమె జోడించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన సెక్యూరిటీ గార్డులతో కంగనా సెప్టెంబర్ 9 న బిఎంసి కూల్చివేసిన కొన్ని గంటల తరువాత ముంబై చేరుకుంది. గురువారం నాడు తన భవంతిని సందర్శించిన కంగన నష్టాన్ని అంచనా వేసింది. శివసేన నాయకుడు సంజయ్ రౌత్తో మాటల యుద్ధం తరువాత కంగనా తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో వై-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కవర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. ముంబైలో తాను అసురక్షితంగా భావిస్తున్నానని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లా పరిస్థితి ఉందని పోల్చడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రౌత్ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు.

ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో కంగనా నేరుగా ఠాక్రేను టార్గెట్ చేసింది. “ఉద్ధవ్ ఠాక్రే ఫిల్మ్ మాఫియాతో కుమ్మక్కై నా ఇంటిని పడగొట్టడం ద్వారా మీరు నాపై ప్రతీకారం తీర్చుకున్నారని అనుకున్నారా? ఈ రోజు నా ఇల్లు కూల్చివేశారు. కాని రేపు మీ అహంకారం నలిగిపోతుంది. కాలం మారుతుంది. మీరు నాకు భారీ సహాయం చేసారని నేను అనుకుంటున్నాను. కాశ్మీరీ పండితుల విషయంలో తప్పక ఏమి జరిగిందో నాకు తెలుసు. కాని ఈ రోజు నేను దానిని అనుభవించాను. అయోధ్యపైనే కాదు.. కాశ్మీర్ పై కూడా సినిమా చేస్తానని శపథం చేస్తున్నాను. నేను నా తోటి దేశస్థులను రెచ్చగొడతాను. ఇది నాకు జరిగింది. దీనికి కొంత అర్ధం తో పాటు ప్రాముఖ్యత ఉంది. ఉద్ధవ్ ఠాక్రే క్రూరత్వానికి భీభత్సానికి నేను నష్టపోయాను“ అని కంగన ఆవేశంగా నయా పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడం రక్తి కట్టించింది.