ఓవర్ నైట్ ఫేట్ మారిపోవడం అంటే ఏంటో శ్రుతిహాసన్ కు తెలుసు. ఈ అమ్మడు వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా పాపులరైన క్రమంలోనే సడెన్ గా గబ్బర్ సింగ్ ఆఫర్ అందుకుంది. ఆ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే అమ్మాయిగా శ్రుతి టోన్ డౌన్ నటనకు పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ ఒక్క బ్లాక్ బస్టర్ తో తన ఫేట్ కూడా మారిపోయింది.
ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆఫర్ నే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందుకోబోతోందా? అంటే.. పాత్ర తీరుతెన్నులు .. ఎంచుకున్న స్టోరీ నేపథ్యం వేరే కానీ అంతే ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం అందుకోనుందని ప్రచారమవుతోంది. అందునా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిధికి ఆఫర్ అంటేనే ఎగిరి గంతేయాల్సిన సన్నివేశం ఉంది.
ఇటీవల ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా నిధికి సరైన ఆఫర్ లేదు. డెబ్యూ హీరో సరసన ఛాన్స్ దక్కినా ఆ మూవీ ఉందో లేదో కూడా తెలీని పరిస్థితి. ఇలాంటి సన్నివేశంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27 వ చిత్రంలో నిధి ఆఫర్ దక్కించుకుందన్న ప్రచారం హీటెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమైనా..కథానాయిక ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇన్నాళ్లు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ తో జతకడుతుందని ఊహాగానాలు సాగాయి. కానీ ఇప్పుడు పేరు మారింది. నిధి టీమ్ లో చేరనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుతో నిధి కెరీర్ తదుపరి స్థాయికి చేరుతుందన్న అంచనా పెరిగింది. అయితే దీనిపై దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంటుంది. క్రిష్ ఇప్పటికే ఉప్పెన్ హీరో వైష్ణవ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి పవన్ తో మూవీ షెడ్యూల్ పై పని చేస్తున్నారు.