2020 ఏ రకంగా చేసినా అశుభమే. అంతా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఈ ఏడాది ఎవరికీ కలిసి రాలేదు. ఇక పలువురు సినీప్రముఖుల మరణాలు కలవరం రేపుతున్నాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చెదురుముదురు ఘటనలు కలతకు గురి చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా తెలుగు సినీపరిశ్రమ దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం నెలకొంది.
సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి (74) గుండె పోటుతో కన్ను మూశారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెలకొంది. విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేయగా.. వెంకటేశ్వరరావుకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్టుల సంఘం సహా పలు అసోసియేషన్లు తమ సానుభూతిని వ్యక్తం చేశాయి.
పరుచూరిని మెగాస్టార్ చిరంజీవి .. నందమూరి బాలకృష్ణ .. మోహన్ బాబు సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు. పరిశ్రమ అగ్ర హీరోలందరితోనూ పరుచూరి బ్రదర్స్ అనుబంధం గురించి తెలిసినదే. విజయలక్ష్మి గారి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీలో దాదాపు 350 పైగా చిత్రాలకు రచయితలుగా పని చేసారు. ఇటీవల రిలీజైన `సైరా నరసింహారెడ్డి` చిత్రానికి ఈ జోడీ పని చేసిన సంగతి తెలిసిందే. అగ్ర రచయితల ఇంట అసిస్టెంట్ల ఎదుగుదలకు అమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు అందేవి.