పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ స్టార్ట్ చేసాడు పవన్. అయితే ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా నిలిచిపోయాయి. పవన్ తిరిగి షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడనే విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చేసాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్.. సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పలేమని.. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమేనని.. నటీనటులకు కరోనా సోకే అవకాశం ఉందని.. అందుకే మనోధైర్యం నింపే ఒక వ్యాక్సిన్ వచ్చే వరకు నిస్సహాయతతో వెయిట్ చేయడం మంచిదని సూచించాడు. దీంతో పవన్ వ్యాక్సిన్ వచ్చే వరకు సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం అయిపోయింది. అయితే పవన్ అడ్వైజ్ ని మిగతా మెగా హీరోలు పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు.
కాగా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. అంతేకాకుండా మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. ఇన్ని రోజులు చిత్రీకరణ వాయిదా వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్.. సీక్రెట్ గా మిగతా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా సెట్స్ లో అడుగుపెడుతున్నాడు. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు వైష్ణవ్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైందని సమాచారం. సింగిల్ షెడ్యూల్ లో అక్టోబర్ చివరికి ఈ మూవీని కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
అంతేకాకుండా నాలుగు నెలలుగా ఆగిపోయిన చాలా చిన్న సినిమాలు మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేసేశాయి. థియేటర్స్ రీ ఓపెన్ చేయకపోయినా ఓటీటీలో అయినా మూవీస్ రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచనతో రిస్క్ తీసుకొని షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. వీటితో పాటు టీవీ సీరియల్స్ పలు షో ల చిత్రీకరణ కూడా ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు కరోనా సోకినా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద కరోనా సమయంలో రిస్క్ తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా చాలామంది షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు.