Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాలగర్భంలో శాంతి థియేటర్.. అదే బాటలో మరికొన్ని.. ఈ దుస్థితికి కారణమేంటి?

కాలగర్భంలో శాంతి థియేటర్.. అదే బాటలో మరికొన్ని.. ఈ దుస్థితికి కారణమేంటి?


హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా దెబ్బతో ఎన్నో నెలలుగా చాలా థియేటర్లు నష్టపోయాయి. దశాబ్ధాల చరిత్ర ఉన్న శాంతి థియేటర్ను తప్పని సరి పరిస్థితుల్లో మూసేస్తున్నట్టు ప్రకటించింది యాజమాన్యం. శాంతి థియేటర్ బాటలోనే అనేక థియేటర్లు పయనిస్తున్నాయి. దిల్సుఖ్నగర్లోని మెగా వెంకటాద్రి కోణార్క్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. థియేటర్లు మూతపడటానికి తక్షణ కారణం అయితే కరోనాయే కానీ అసలు కారణం మాత్రం కేవలం కరోనా మాత్రమే కాదు. కరోనా ముప్పు రాకముందే తెలుగురాష్ట్రాల్లోని సింగిల్స్క్రీన్ థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.

ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు పెద్దగా రావడంలేదు. సినిమాల చూస్తున్నది యువత మాత్రమే. వారు కూడా మల్టిపెక్స్ల్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. మారుతున్న అభిరుచులే ఇందుకు కారణం. అయితే కరోనా రాకముందే హైదరాబాద్తో పాటు తెలుగురాష్ట్రాల్లోని పలుచోట్ల థియేటర్లు నష్టాలలతో నడిచేవి. ప్రభుత్వం పార్కింగ్ ఫీజ్ ఎత్తేయడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. నిర్వహణ భారం పెరిగిపోయి థియేటర్లు మూసేసే పరిస్థితి వచ్చింది. కరోనాతో థియేటర్లు మూతపడటంతో ఇప్పటికే యాజమాన్యం అందులోని సిబ్బందిని ఇంటికి పంపించేసింది. నిదానంగా థియేటర్లను కూడా మూసేస్తున్నారు.

నారాయణగూడలోని శాంతి థియేటర్కు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ థియేటర్కు వెళ్లేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే అక్కడే చిత్రాలను కూడా ప్రదర్శించేవారు. అంతేకాక శాంతి థియేటర్ నిర్మాణపరంగా కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. 1969లో పిచ్చేశ్వర రావు అనే వ్యాపారి నారాయణగూడలో శాంతి థియేటర్ను నిర్మించారు.అంతకు ముందు ఇక్కడ మామిడితోట ఉండేదట. పిచ్చేశ్వర్రావు ఎంతో ఆసక్తితో దీని నిర్మాణం చేపట్టారు. పుణె నుంచి వాస్తుశిల్పిని తీసుకొచ్చి దగ్గరుండి డిజైన్ చేయించారు. థియేటర్లో పెట్టిన షాండ్లియర్ కోసం ఆయన దేశమంతా పర్యటించారట.

ఈ థియేటర్ను మూసేస్తున్నట్టు ఆయన ఇటీవల సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈపోస్టుకు సోషల్మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది తమ కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. కాలేజీ ఎగ్గోట్టి శాంతి థియేటర్కు వెళ్లిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఇప్పడు ఒక్క శాంతి థియేటర్ మాత్రమే కాక.. హైదారబాద్లోని పలు థియేటర్లు మూత పడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

మూతపడుతున్న థియేటర్లను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని.. థియేటర్లకు విద్యుత్బిల్లలను మాఫీ చేయాలని పార్కింగ్ ఫీజు వసులు చేసుకోనే అవకాశం ఇవ్వాలని థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి కోరుతున్నారు. నిజానికి టికెట్ల రూపంలో వచ్చే సొమ్మంతా సినీ నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకే వెళ్లిపోతుందని ఆయన వివరించారు. అందువల్ల పార్కింగ్ ఫీజు వసులు చేసుకొనే అవకాశం కల్పిస్తే థియేటర్లు కొంతవరకు కోలుకుంటాయని ఆయన అంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.