Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!

మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!


సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ మహేష్. అందుకే ఆరడుగుల అందగాడు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ముందుకొస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో ఎండార్స్మెంట్స్ చేతిలో పెట్టుకున్న మహేష్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ వస్తున్నారు. ఇక ప్రముఖ శీతలపానీయం బ్రాండ్ ‘థమ్స్ అప్’ కి మహేష్ గత కొన్నేళ్లుగా అంబాసిడర్ గా ఉన్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక థమ్స్ అప్ ప్రకటనల్లో పాల్గొన మహేష్.. ఇప్పుడు మరో యాడ్ తో ముందుకు వచ్చారు. అయితే ఈసారి తన ఫేస్ చూపించకుండా కేవలం గొంతు తోనే పలకరించారు.

2020లో జపాన్ రాజధాని టోక్యో కేంద్రంగా జరగనున్న ఒలింపిక్ గేమ్స్ కు వరల్డ్ వైడ్ పార్టనర్ గా థమ్స్ అప్ కంపెనీ వ్యవహరిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో థమ్స్ అప్ ఓ టీవీ కమర్షియల్ యాడ్ షూట్ చేసింది. ‘ఒలింపిక్ గేమ్స్ టోక్యో-2020 లో ఇండియాకి ఉన్న గుర్తింపుని తలక్రిందులు చెయ్’ అనే థీమ్ తో భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ యాడ్ ని రూపొందించారు. దీనికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ను అందించారు. ‘అంచనాలను తలక్రిందులు చెయ్’ అంటూ తాజాగా న్యూ థమ్స్ అప్ టీవీ యాడ్ ని రిలీజ్ చేశారు.

”ముందు మీ నాన్న నుండి కాస్త అయినా నేర్చుకో భజరంగ్.. లేదా నీ దారైనా మార్చుకో.. అనే వాళ్ళ మాటల్ని తలక్రిందులు చెయ్” అంటూ బేస్ వాయిస్ లో మహేష్ పలకడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒక్కో క్రీడకు ఉద్దేశిస్తూ.. ప్లేయర్స్ ని మహేష్ గొంతుతో ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఈ యాడ్ రూపొందించబడింది. ‘తూటాలతో ఆటలా?.. మీ నాజూకు చేతులకు బందూక్ అవసరమా మనూ? అని తక్కువ చేసే వారి చూపుల్ని తలక్రిందులు చెయ్’ ‘వికాస్ ఇంకా ఎన్ని దెబ్బలు తింటావ్?.. నీ వల్ల కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్? అనే వాళ్ళ సలహాలను తలక్రిందులు చెయ్’ ‘వీళ్ళెక్కడ గెలుస్తారు.. ఒట్టి చేతులతో తిరిగొస్తారు.. అనేవాళ్ళ అంచనాలను తలక్రిందులు చెయ్’ ‘ఎందుకంటే అసలైన తూఫాన్.. దేన్నైనా తలక్రిందులు చేసే వాళ్లే..’ వంటి మోటివేషన్ డైలాగ్స్ ను మహేష్ ఇందులో పలికారు. మహేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ యాడ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ తన 28వ సినిమా చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా #SSMB28 తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా చేయనున్నారు మహేష్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.