విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో 12మంది మృతి చెందిన వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే హీరో రామ్ సంచలన ట్వీట్స్ చేసి సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. రమేశ్ ఆసుపత్రినే బాధ్యులను చేయవద్దని కోరారు.
తాజాగా హీరో రామ్ మరో సంచలన ట్వీట్ చేశారు. ‘చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అసలైన కుట్రదారులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇకపై ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయను’ అని హీరో రామ్ పేర్కొన్నాడు.
ఇప్పటికే హీరో రామ్.. ఈ వివాదంపై సీఎం జగన్ కు సూచిస్తూ సంచలన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.. స్వర్ణపాలెస్ ఘటనలో సీఎం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని.. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద లుక్కేయండని’ రామ్ ట్వీట్ చేశారు.
కాగా హీరో రామ్ ట్వీట్లపై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్పందించారు. ‘ రమేశ్ ఆసుపత్రి యాజమన్యా వ్యవహారంపై సీరియస్ గా వ్యవహరిస్తాం. డాక్టర్ రమేశ్ డాక్టర్ మమత కళ్యాణ్ చక్రవర్తిలు విచారణకు రావడం లేదు. నోటీసులు తీసుకొని విచారణకు రాకుండా ఆటంకం కలిగిస్తున్నారు. హీరో రామ్ బాబాయ్ అయిన డాక్టర్ రమేశ్ ను కాపాడేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు అడ్డుతగిలితే రామ్ కి కూడా నోటీసులు పంపిస్తామని ఏసీపీ హెచ్చరించారు. పది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ హీరో రామ్ ట్వీట్లను తప్పుపట్టారు. క్వారంటైన్ సెంటర్ కు.. కోవిడ్ సెంటర్ కు తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదని సూచించారు. రమేశ్ బాబు విచారణకు హాజరు కావాలని.. ఆడియో టేపులు పంపడం మాని ఆధారాలు సమర్పించాలని ఏసీపీ సూచించారు.