సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయం చేసే గుణం అందరికీ ఉంటుంది.. కానీ ప్రతిసారి సాయం చేసే గుణం కొందరికే ఉంటుందంటారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. 1010 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ప్రాణదానం చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నారు మహేష్. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేపించడానికి సహాయం చేసి ఆ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు మహేష్. ఈ క్రమంలో భవ్య శ్రీ మరియు సింధు అనే ఇద్దరు చిన్నారులకు హార్ట్ ప్రాబ్లమ్ తో బాధ పడుతున్నారని తన టీమ్ ద్వారా తెలుసుకున్న మహేష్.. ఇటీవల వారికి సర్జరీస్ చేయించారు.
కాగా ఇప్పుడు ఆ చిన్నారులిద్దరూ కోలుకున్నట్లు మహేష్ సతీమణి నమృత ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ”ఆంధ్రా హాస్పిటల్స్ తో అసోసియేట్ అవడం మాకు ఎంతో గర్వకారణం. చిల్డ్రన్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ పివి రామారావు మరియు అతని వైద్య నిపుణుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. భవ్యశ్రీ సింధు కోలుకున్నారని.. మంచి ఆరోగ్యంతో ఉన్నారని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నారులు వారి ఫ్యామిలీలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొస్తున్న మహేష్ నిజమైన హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను మహేష్ బాబు దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.