Templates by BIGtheme NET
Home >> Cinema News >> దిగ్గజాలు ఒకచోట కలిశారు..!

దిగ్గజాలు ఒకచోట కలిశారు..!


కర్ణాటకలోని ఒక చిన్న పట్టణంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నవీన్ కుమార్ గౌడ అలియాస్ యష్.. కన్నడ రాకింగ్ స్టార్ గా మారి ‘కేజీఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. కన్నడ సీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు యష్. నేడు యష్ తన 35వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత రాజకీయవేత్త పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి) యశ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు.

ఇందులో పీవీపీ తో పాటు రాకింగ్ స్టార్ యష్ – బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపిస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ ‘రాఖీ భాయ్’ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ‘అధీరా’గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఆధిపత్యం కోసం వీరిద్దరి మధ్య జరిగే భీకరమైన పోరును చాప్టర్-2లో చూడబోతున్నాం. యష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘కేజీఎఫ్ 2’ టీజర్ లో శాంపిల్ గా చూపించారు. ఇప్పుడు ‘కేజీఎఫ్’ కోసం పోరాడే దిగ్గజాలు ఒకే ఫొటోలో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ఇకపోతే ‘కేజీఎఫ్ 2’ టీజర్ తక్కువ సమయంలో మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.