ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. నిజానికి షూటింగ్ అయిపోయి విడుదలకు నోచుకోని సినిమాల సంగతే ఇలా ఉంటే.. మరి అసలు షూటింగ్స్ మొదలు కాకుండా.. మొదలై మధ్యలో ఆగిన వాటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు అమలు చేస్తుండటంతో మెల్లగా మేకర్స్ షూటింగ్స్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. రిలీజ్ గురించి ఆలోచించే సినిమాలను పక్కన పెడితే.. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని ప్రకటించిన సినిమాల సంగతేంటి అని అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అది కూడా సూపర్ స్టార్ సినిమా అయితే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఏర్పడుతుందో ఆలోచించండి. అలాంటి ఇద్దరు దిగ్గజ నటుల కాంబినేషన్లో భారీ సినిమా రానుందని వెయిట్ చేస్తున్న తరుణంలో ఇంతవరకు మళ్లీ ఆ సినిమా ఊసే లేదు.
అయితే అన్నాథే సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సినిమా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాను ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడని.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గత రెండు నెలలుగా నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఖైదీ సినిమా తర్వాత మాస్టర్ సినిమా రూపొందించిన లోకేష్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజినీ-కమల్ సినిమా గురించి ప్రస్తావించాడట. అయితే ఆయన పై వస్తున్న వార్తలకు బలం చేకూరేలా.. కమల్ – రజినీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒప్పందాలు ముగిసాక వెల్లడిస్తాం అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ వార్త సినీ ప్రేక్షకులలో ఈయనే డైరెక్టర్ అంటూ కన్ఫర్మ్ చేసిందంటూ అభిప్రాయ పడుతున్నారు. అలాగే సెప్టెంబర్ నెల లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.