విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ భవనంలో 40 మంది వరకు ఉండగా.. వీరిలో 30మంది కొవిడ్ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది.
దట్టంగా పొగలు అలుముకోవడంతో బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లకు అంబులెన్స్ల్లో తరలించారు. స్వర్ణప్యాలెస్ వద్ద సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
దట్టంగా పొగలు అలముకోవడం వల్లే బాధితులు ఊపిరాడక చనిపోయినట్టు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కింది అంతస్థులో మంటలు చెలరేగి భవనం పైభాగానికి విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 4.45-5.00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగి ఊపిరిడాక విలవిలాడారు. స్వర్ణపాలెస్ హోటల్ను రమేశ్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్గా తీసుకుంది.
మంటలకు భయపడి ఒకటో అంతస్థు నుంచి నలుగురు కిందికి దూకినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో కృష్ణయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 18 మందిని వేరే ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గూరు కోవిడ్ పాజిటివ్ రోగులేనని తెలుస్తోంది. ఒకే మార్గం కావడంతో నిచ్చెనల సాయంతో బాధితులను బయటకు తీసుకొచ్చారు.
విజయవాడ ప్రమాదంపై జగన్కు మోదీ ఫోన్.. చేతనైన సాయం చేస్తామని హామీ..
విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. అగ్ని ప్రమాద వివరాలను సీఎంను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఓ హోటల్ను ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తోందని వివరించారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడ్డారన్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, క్షతగాత్రులను వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.
కాగా, విజయవాడ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.. ప్రస్తుత పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నానని, తమ వంతు సహకారం అందజేస్తామని అన్నారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
