Templates by BIGtheme NET
Home >> Telugu News >> భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!

భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!


చెస్ ఒలింపియాడ్ లో భారత్ మరో చరిత్ర రాసింది. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. దశాబ్దాల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ ను విజేతగా నిలపడంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ ను తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించారు. 93 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటిదాకా భారత్ ఒక్కసారి మాత్రమే పతకం గెలిచింది. 2014లో కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా పసడి నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో మన తెలుగు చెస్ తారలు కోనేరు హంపి ద్రోణవల్లి హారిక పెంటేల హరికృష్ణలది కీలక పాత్ర. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్ విదిత్ గుజరాతి ప్రజ్ఞానానంద దివ్య దేశ్ ముఖ్ భక్తి కులకర్ణి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఫైనల్ లో కోనేరు హంపి రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడ్డారు. తొలి రౌండ్ 3-3 పాయింట్లతో డ్రా అయింది. రెండో రౌండ్ కొనసాగుతుండగా ఇంటర్నెట్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అప్పటికి రష్యా 4.5-1.5 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో తొలుత రష్యాను విజేతగా ప్రకటించారు. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ దశలో భారత్ అప్పీల్ చేయగా చేయగా ఆ తర్వాత కాసేపటికే డ్రాగా ప్రకటించారు. భారత్-రష్యాను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. విజేతలను ప్రధాని మోదీ అభినందించారు.