Templates by BIGtheme NET
Home >> Telugu News >> తెలంగాణలో మరో అవినీతి తిమింగలం!!

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం!!


కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రోజే.. తెలంగాణలో ఆ శాఖలో మరో భారీ అవినీతి బయటపడడం కలకలం రేపింది. కేసీఆర్ అన్నట్టే తెలంగాణలో రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఓ భూ వివాదంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఏకంగా రూ.1.12కోట్లకు డీల్ కుదుర్చుకొని రూ.40 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

మొన్నటికి మొన్న కీసరలో ఓ తహసీల్దార్ కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా దొరికాడు. ఈ సంఘటన తెలంగాణతో యావత్ సంచలనమైంది. ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో అత్యున్నత అధికారి రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కీసర సంఘటనను తలదన్నేలా మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి తాజాగా పట్టుబడ్డాడు.

నర్సాపూర్ డివిజన్లోని చిప్పలకుర్తి గ్రామంలోని 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు కోటి 12లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కోటి రూపాయల మేర ఆస్తులకు లంచం కింద ఒప్పందం పత్రాలు రాసుకున్నాడు. తొలి విడుతగా బాధితులు 40లక్షల డబ్బులు నగేష్ కు ముట్టజేబుతుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

తెలంగాణ సర్కార్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తుండడంతో ఇక తమ ఆటకు సాగవని రెవిన్యూ అధికారులు గ్రహించినట్లు ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడే అందినకాడికి దోచుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే అత్యాశకు పోయిన నగేష్ బాధితుల నుంచి లంచానికి కోటి 12లక్షల లంచానికి ఒప్పందం పత్రం రాసుకున్నాడు. ఈ ఒప్పంద పత్రమే ప్రస్తుతం అతడిని ఈ కేసు నుంచి తప్పించుకోకుండా చేసినట్లు కన్పిస్తుంది.

నగేష్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెండ్ గా పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అతడి ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు బ్లాక్ చెక్కులు ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. కోటి 12లక్షల లంచానికి సంబంధించిన డీలులో 40లక్షల నగదు 72లక్షలకు భూమి రిజిష్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం రాసుకోవడం ఈ కేసులో ట్వీస్ట్ గా మారింది.