Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఓడిపోయినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత

ఓడిపోయినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత


దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తమపార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు మొక్కులు చెల్లించాడు. ఎవరైనా తమ పార్టీ గెలవాలి, తమ లీడర్ విజయం సాధించాలి అని తమ ఇష్టదైవాలను మొక్కుకుంటారు. అనుకూల ఫలితాలు వస్తే మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ ఓ టీఆర్ఎస్ లీడర్ తమ పార్టీ ఓడిపోవాలని ముడుపు కట్టడం విస్మయానికి గురి చేస్తోంది.

అయితే అలా మొక్కకున్న ఆయనేం చోటమోట కార్యకర్త ఏం కాదు. 20 ఏళ్లగా పైగా రాజకీయ అనుభవంతోపాటు రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టిన వ్యక్తి. సూర్యాపేట మాజీ కౌన్సిలర్ ఆ పార్టీ ఓడిపోతే 101 కొబ్బరి కాయలు కొడతా అని మొక్కుకున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే. ఆయన పేరు గోదాల రంగారెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి. గతంలో టీడీపీ నుంచి కౌన్సిలర్ గెలుపొందాడు. ఆయన భార్య గోదాల భారతమ్మ టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉన్న ఆయన.. స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత వివాదాల వల్ల గతకొంత కాలంగా క్షేత్రస్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.

టీఆర్ఎస్‌పై ఉన్న అసహానంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే 101 కొబ్బరి కాయలు కొడతా అని తెలంగాణలోనే రెండో అతి పెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామికి మొక్కుకున్నాడు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో గోదాల రంగారెడ్డి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. పార్టీలోనే ఉండి పార్టీ ఓటమిని కోరుకున్న ఆయన తీరుపట్ల పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.