Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ కేసును అర్నాబ్ తప్పుదోవ పట్టించాడనే పిల్ పై హైకోర్టు విచారణ..!

సుశాంత్ కేసును అర్నాబ్ తప్పుదోవ పట్టించాడనే పిల్ పై హైకోర్టు విచారణ..!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అర్నాబ్ గోస్వామి మరియు అతని రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్ నిర్వహించిన రిపోర్టింగ్ “వాస్తవాలను వక్రీకరించే విధంగా మరియు తప్పుదోవ పట్టించేలా” ఉందంటూ దాఖలైన పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అర్నాబ్ గోస్వామి రిపోర్టింగ్ ఫలితంగా రియా చక్రవర్తి న్యాయమైన విచారణ హక్కు ఉల్లంఘనకు గురైందని పిల్ ఆరోపించింది. నేర పరిశోధనలకు సంబంధించిన అన్ని వార్తలను నివేదించడం లేదా ప్రసారం చేయడం కోసం నియమ నిబంధనలు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషన్ కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్ – జస్టిస్ ప్రతీక్ జలన్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. క్రిమినల్ ప్రోబ్స్ యొక్క మీడియా రిపోర్టింగ్స్ క్రమబద్ధీకరించడానికి ఎలాంటి నియమాలను రూపొందించవచ్చో తగు సూచనలతో నవంబర్ 27 తేదీన రావాలని ధర్మాసనం పిటిషనర్ ను కోరింది.

సుశాంత్ సింగ్ మృతి కేసులో “పక్షపాత ధోరణి రిపోర్టింగ్” చేసినందుకు అర్నాబ్ గోస్వామి మరియు అతని ఛానెల్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిల్ కోరింది. సుశాంత్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి వ్యతిరేకంగా అర్నాబ్ గోస్వామి మరియు అతని టీవీ ఛానెల్స్ కథనాలు ఉన్నాయని.. “న్యాయమూర్తి జ్యూరీ మరియు ఉరిశిక్షకుడిగా” ప్రవర్తించారని పిటిషన్ ఆరోపించింది. “ప్రస్తుత కేసు విచారణలో ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా హత్య అనే కోణంలో దర్యాప్తు చేయలేదు. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పాట్నా పోలీసులు కూడా ఆత్మహత్య మరియు ఇతర శిక్షా నిబంధనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం అతనిది హత్య కాదు ఆత్మహత్య అని తేల్చింది” అని పిటిషన్ పేర్కొంది. పరిశోధనాత్మక జర్నలిజం పేరిట అనామక సమాచారంతో నేర పరిశోధనకు సంబంధించిన ఏ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా సదరు జర్నలిస్ట్ మరియు ఛానెల్ ను నిరోధించాలని కోరింది.

కాగా సుశాంత్ మృతి కేసుపై బాగా ఫోకస్ పెట్టిన నేషనల్ ఛానల్ రిపబ్లిక్ టీవీ.. అతనిది ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా అనేక కథనాలు వెలువరిస్తూ వస్తోంది. సుశాంత్ మృతికి రియా చక్రవర్తి ఎంత వరకు బాధ్యురాలో తెలియదు కానీ.. రిపబ్లిక్ టీవీ మాత్రం ఆమె దోషి అని తీర్పు చెప్పే విధంగా న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఏది నిజమో ఏది అబద్దమో అని ప్రజలు ఆలోచించుకునే సమయం లేకుండా వరుస కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకపక్క సీబీఐ – ఎన్సీబీ దర్యాప్తు చేస్తుంటే ఈ ఛానల్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసుని దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. అయితే సీబీఐ నిజానిజాలు వెల్లడించినప్పటికీ.. గత రెండు నెలలుగా రియా పైనే ఈ మీడియా ఛానల్ ఫోకస్ చేసి ఇదే నిజం అని చెప్పే ప్రయత్నం చేసిందనే కామెంట్స్ వచ్చాయి. దీంతో రియా మీద వ్యతిరేకతతో ఉన్న వాళ్లు సైతం ఆమె మీద జాలిపడే స్థాయిలో ఆమెపై కథనాలు వచ్చాయని అనుకుంటున్నారు. చివరకు ఎయిమ్స్ బృందం సుశాంత్ ది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో 28 జైలులో ఉన్న రియా బెయిల్ పై బయటకు వచ్చింది. ఇప్పుడు రియా కూడా రిపబ్లిక్ టీవీ ఛానెల్ మీద న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి.