Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆచార్య కాపీ వివాదం కోర్టుల వరకూ వెళతారట!

ఆచార్య కాపీ వివాదం కోర్టుల వరకూ వెళతారట!


`ఆచార్య` కథ నాదే అంటూ రాజేష్ అనే రచయిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవేమీ అనుకున్నంత మామూలుగా ఏమీ లేదు. డైరెక్టుగా ప్రముఖ వార్తా చానెళ్ల లైవ్ లోకే వెళ్లిన కొరటాల .. తనపై వచ్చన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవ్వడం ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తన పరువు మర్యాదలకు భంగం కలిగిస్తూ అతడు (రైటర్ రాజేష్) కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే చూసి ఈ కథ నాది.. కొరటాల – మైత్రి బృందం కొట్టేశారు! అన్నట్టుగా ఇంటర్వ్యూల్లో మాట్లాడి తన పరువు తీశాడన్నది కొరటాల రివర్స్ లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంటర్వ్యూ ఆద్యంతం లైవ్ లో రాజేష్ తో మాట్లాడే క్రమంలో కొరటాల ఎమోషన్ అవ్వడం కనిపించింది.

ఇది నాదే అంటున్నాడు! అలా ఎలా చెబుతాడు!! అసలు అతడు రాసిన కథను నేను సినిమాగా తీయడం లేదు. నా కథనే నేను సినిమా తీస్తున్నాను! అంటూ కొరటాల ఊగిపోవడం ఆ ఇంటర్వ్యూలో కనిపించింది. నేను ముఖ్యమంత్రి కథ రాసుకున్నప్పుడు 10 మంది దగ్గర ముఖ్యమంత్రి కథలు ఉన్నాయి. ఇప్పుడీయన ఎలా ఆరోపిస్తారు నాపైన. దీనిని సీరియస్ గా తీసుకుంటున్నా. కోర్టులో కేసు వేస్తాను! అంటూ సీరియస్ అయ్యారు కొరటాల. అయితే రాజేష్ అనే ఆ రైటర్ మాత్రం .. తాను కొరటాలను ఎట్టిపరిస్థితిలో ఎత్తి చూపలేదని.. కేవలం మైత్రి సంస్థ అధిపతులు మాత్రమే నా వద్ద నుంచి కథను నా ఐడియాను విని కాపీ చేశారని అన్నానని శాంతపరిచేందుకు ప్రయత్నించాడు. మైత్రివాళ్లు తీసేది తన ఐడియానే అని ఆచార్య కోడైరెక్టర్ ని అడిగి కూడా తెలుసుకుని కన్ఫామ్ చేసుకున్నానని అతడు వాదించాడు. నిర్మాతలకు మీరెంతో సన్నిహితులు కాబట్టి నా కథను ఐడియాను చర్చించి ఉండొచ్చు కదా! అన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ గొడవ అనుకున్నంత చిన్నది కాదు. ఇందులో కొరటాల మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారని అర్థమవుతోంది.

ఈ తరహా గొడవలు ఇదివరకూ చాలా సినిమాల విషయంలో చూసినవే. నిజానికి సెట్స్ లో ఉన్న చాలా సినిమాలకు ఇలాంటి గొడవలు ఉన్నాయి. నిజానికి ఒకరి ఐడియాను కాపీ చేశారని భావించినా కానీ.. స్క్రిప్ట్ వర్క్ చేసేందుకు పది మంది రచయితలు ఉద్ధండులు కలిసి చాలా కాలం పని చేస్తారు దానిపైన.. చివరికి ఆ స్క్రిప్టు రూపురేఖలే మారిపోతాయి. కేవలం థీమ్ మాత్రం రచయితల నుంచి తీసుకుని తర్వాత దర్శకరచయితలు నిర్మాతలు హీరోల కనుగుణంగా మార్చుకుని చాలా కసరత్తు చేసి దానికోసం కోట్లు ఖర్చు చేస్తారన్నది తెలిసింది కొందరికి మాత్రమే.