50 ప్లస్ హీరోలు బయటకు వచ్చి షూటింగుల్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. రావొద్దని డాక్టర్లు సలహాలు ఇస్తుండడంతో మహమ్మారీకి భయపడి ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. వచ్చిన వారికి ఏదో ఒక రకంగా ముప్పు తప్పలేదు. ఇకపోతే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సీనియర్ హీరోలెవరూ బయటకు వెళ్లేందుకు ఆసక్తిని కనబరచలేదు అంటూ కరోనా ఎంతగా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బాలీవుడ్ స్టార్లు దేనికీ భయపడక విదేశీ షూటింగులకు పయనమైపోవడం షాకిస్తోంది. బెల్ బాటమ్ చిత్రీకరణ కోసం అక్షయ్ స్కాట్లాండ్ వెళ్తుండగా.. అమీర్ లాల్ సింగ్ చద్దా యొక్క బ్యాలెన్స్ షూటింగును పూర్తి చేయడానికి టర్కీకి వెళ్లాడు. అదే బాటలో మహేష్ బాబుకు కూడా ఇలాంటి ప్రణాళికలు ఉన్నాయని తెలిసింది.
ఇటీవల మహేష్ అన్నపూర్ణ ఏడెకరాల్లో వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం వచ్చారు. ఈ షూట్ తరువాత అతను చాలా భద్రతా మార్గదర్శకాలను పాటించి జాగ్రత్త పడ్డారు. ఇకపైనా ఈ కఠినమైన కోవిడ్ -19 కి భయపడక షూటింగులతో టాలీవుడ్ ముందుకు సాగడానికి ఆయనే స్ఫూర్తి కానున్నారని అర్థమైంది. అలాగే సీనియర్ హీరో నాగార్జున 60 ప్లస్ లో ఓవైపు బిగ్ బాస్.. మరోవైపు వైల్డ్ డాగ్ చిత్రీకరణలోనూ పాల్గొంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. మహేష్ – పరశురామ్ బృందం అమెరికా డెట్రాయెట్ లో షూటింగ్ చేయనున్నారట. సర్కార్ వారి పాట చిత్రీకరణ కోసం ఏకంగా చార్టెడ్ విమానాన్ని ఎక్కుతున్నారన్న ప్రచారం వేడెక్కిపోతోంది.