గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వకీల్ సాబ్ (పింక్ రీమేక్) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కమిటవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. వరుసగా దర్శకరచయితలు వినిపిస్తున్న కథలు విని వేగంగా డెసిషన్స్ తీసుకోవడం చూస్తుంటే పవన్ అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యారు.
తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ లో నటించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. సాగర్ చంద్ర అందించిన స్క్రిప్ట్ నచ్చింది. అయితే ఇలాంటి ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించే సమర్థుడైన దర్శకుడి కోసం వేచి చూస్తున్నారట. అలాగే దర్శకుడిని ఎంపిక చేసే పనిని తన స్నేహితుడు త్రివిక్రమ్ కి పవన్ అప్పగించారని సమాచారం.
తొలుత వెంకీ అట్లూరి పేరు వినిపించినా కానీ పవన్ అతడికి ఓకే చెప్పలేదట. వేరొక అనుభవజ్ఞుడైన దర్శకుడి కోసం త్రివిక్రమ్ ని వెతకమన్నారట. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని పవన్ డెడ్ లైన్ పెట్టారు. ఆ మేరకు ఇప్పటినుంచి పని మొదలైనట్టేనట. అయితే త్రివిక్రమ్ స్వయంగా పూనుకుని అశ్రద్ధ చేయక దర్శకుడిని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో పాటు క్రిష్ సినిమాని కూడా పవన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.