సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ స్వర్ణప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి హీరో రామ్ చేసిన కొన్ని ట్వీట్స్ నెట్టింట సెన్సేషన్ కావడమే గాక పలు చర్చలకు దారితీశాయి. స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి సీఎం జగన్పై కుట్ర జరుగుతోందంటూ రామ్ పేర్కొనడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఈ క్రమంలో విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని, విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్కి కూడా నోటీసులు జారీ చేస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పడంతో విషయం మరింత హాట్ టాపిక్ అయింది. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రామ్కు మద్దతు తెలుపుతూ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని తెలిపారు.
ఈ పరిణామాల నడుమ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన గురించి ఇకపై తాను ఎలాంటి ట్వీట్లు చేయబోనని రామ్ ప్రకటించారు. అయితే తన అంకుల్ కావడం వల్లనే రమేష్ హాస్పిటల్ ఛైర్మన్ అయిన డాక్టర్ రమేష్ బాబును రామ్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడని కొందరు ఆయనపై కుల ముద్ర వేస్తూ ట్వీట్స్ చేయడం, లైవ్లో పలు ఆరోపణలు చేయడంతో మరోసారి రంగంలోకి దిగి తాజాగా ‘కులం’ గురించి ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్ చేశారు రామ్.
”మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. కులం అని పిలవబడే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపి చెందడమే గాక త్వరగా అంటుకుంటుంది కూడా. ఇది కరోనా కంటే డేంజరస్. ఈ వ్యాధిని సైలెంట్గా వ్యాపింపజేసేవాళ్లు.. మిమ్మల్ని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. దయచేసి దూరంగా ఉండండి. మంచి పని కోసం అందరూ కలిసి ఉండండి. ప్రేమతో రామ్ పోతినేని” అని రామ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో రామ్ vs జగన్ వర్గం ఫైట్ మళ్ళీ తెరపైకి వచ్చి రచ్చ రచ్చ అవుతోంది.
To my dearest Brothers & Sisters.. This Disease called CASTE spreads faster than Corona & is even more Contagious & Dangerous..Stay away from these silent spreaders no matter how hard they try to Pull you or Push you into it!
Stay Together For the Greater Good! ✊
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) August 17, 2020