Templates by BIGtheme NET
Home >> Cinema News >> సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?

సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?


గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సుశాంత్ అనుమాస్పద మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం బయటకు పొక్కడంతో శాండిల్ వుడ్ లోనూ దీని ప్రతిధ్వనులు వినిపించాయి. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టి పలువురిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్ మరియు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్.. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిండా.. దీపేష్ సావంత్.. డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం లను అరెస్ట్ చేసింది. తాజాగా రియా ని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రియాను విచారించిన అధికారులు పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లను రాబట్టినట్టు సమాచారం.

మరోవైపు శాండిల్ వుడ్ లో అనేకమంది సినీ నటీనటులు మ్యూజిషియన్లు కూడా నిషేధిత డ్రగ్ యూజర్లేనని తేలింది. బెంగుళూరులోని ఓ హోటల్లో పలువురిని అరెస్టు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరు సినీ నటులకు సంగీత దర్శకులకు విద్యార్థులకు రకరకాల మత్తు మందులను సప్లయ్ చేస్తారని సమాచారం రాబట్టారు. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ.. తాజాగా హీరోయిన్ సంజన గల్రానీ ని కూడా అరెస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత మంది నటీనటుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే అసలు సినీ సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు?.. ఎప్పుడూ వారే తెరపైకి ఎందుకు వస్తుంటారనే అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కాగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ.. వర్క్ టెన్షన్ తో.. ఫ్యామిలీ టెన్షన్స్ తో మాదకద్రవ్యాలు తీసుకుంటారని.. దాని వల్ల ఉపశమనం పొందుతారనే భ్రమలో ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్ కి బానిసలుగా మారి వాటి నుంచి బయటపడలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో వారి వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది డ్రగ్ డీలర్స్ ఇతర దేశాల డ్రగ్ వ్యాపారులతో డీలింగ్స్ పట్టుకొని.. ఇక్కడ సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి దింపుతారని తెలుస్తోంది. ఈ మధ్య హీరోయిన్ కంగనా రనౌత్ సైతం బాలీవుడ్ లో 99 శాతం డ్రగ్స్ తో నిండి ఉందని.. మాదకద్రవ్యాలు లేకుండా పార్టీలు ఉండవని.. నీళ్లలా తీసుకుంటారని.. రణవీర్ సింగ్ – విక్కీ కౌశల్ వంటి హీరోలపై డ్రగ్స్ ఆరోపణలు చేసింది. ఇక టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ దందా నడుస్తుందని హీరోయిన్ మాధవీలత కామెంట్స్ చేసింది. డ్రగ్స్ అనేది చాలా చోట్ల ఉన్నప్పటికీ.. సెలబ్రిటీల మీద అందరి ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు హైలైట్ అవుతుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ డ్రగ్స్ కేసులో రానున్న రోజుల్లో ఎంతమంది పేర్లు బయటకి వస్తాయో చూడాలి.