ప్రముఖ వ్యాఖ్యాత కమెడియన్ బిత్తిరి సత్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు. వ్యాధి బారిన పడ్డట్టు స్వయంగా ఆయన ప్రకటించారు. తనలా మరెవరో కరోనా బారిన పడకూడదని బిత్తిరి సత్తి ఓ వీడియో విడుదల చేసి పలు జాగ్రత్తలు తెలియజేశారు. ‘ నాది స్టాండర్డ్ బాడీ.. నాకు కరోనా రాదనుకున్నా. కానీ ఎలా వచ్చిందో తెలియదు గానీ వచ్చింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. నాకు కరోనా వచ్చిందని చాలా మంది అభిమానులు మెసేజ్ లు పెడుతున్నారు. అసలు ఎలా వచ్చింది.. సింటమ్స్ ఎలా ఉంటాయి.. అని అడుగుతున్నారు.
వాళ్ల కోసం కొన్ని సూచనలు చేయాలనుకున్నా. వైరస్ సోకిన వారు బాగా తినాలని చెబుతుంటే పొట్ట పగిలేలా తింటున్నారు. అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆహారంలో కొర్రలు సజ్జలు జొన్నలు వంటి చిరుధాన్యాలను చేర్చుకోవాలి. రోజంతా ఫుడ్ కొంచెం కొంచెం గా తీసుకోవాలి. తగినంత జ్యూసు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది. నిమ్మ వంటి సిట్రస్ జాతి పండ్లలోనూ ఈ విటమిన్ ఉంటుంది. రోజుకు మూడు నాలుగు సార్లు ఆవిరి ప ట్టుకోవడం మేలు. ఇక సింటమ్స్ విషయానికొస్తే.. నాకు పెద్దగా జ్వరం రాలేదు. ముక్కు దిబ్బ కూడా లేదు. నాలుక పై తీవ్రంగా పొక్కులు రావడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ తేలింది.
రెండు రోజులపాటు గొంతునొప్పితో బాగా ఇబ్బంది పడ్డా. కరోనా లక్షణాలు కనిపిస్తే సిగ్గుతోనో భయంతోనో ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది కాదు. మన వల్ల ఇతరులకు వైరస్ సోకక ముందే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కరోనా వచ్చినా ఇతరులకు చెప్పకుండా ఎదుటివారిని వ్యాధి బారిన పడేలా చేస్తే అంతకంటే మరో పెద్ద ద్రోహి ఉండడు. వైరస్ బారినపడ్డ వారిపై వివక్ష చూపిస్తున్నారు. అప్పటి వరకు బాగున్న వాళ్ళు కూడా వ్యాధిగ్రస్తులను తాచుపాముల చూస్తున్నారు. అదేదో డేంజరస్ పర్సన్ వచ్చినట్లు చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు’ అని బిత్తిరి సత్తి చెప్పారు. అందరి ప్రార్థనలతో తొందర్లోనే కోలుకుని సాక్షిలో గరం గరం వార్తలతో కనిపిస్తానని తెలిపాడు.