Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాజకీయాల్లోకి వస్తా గెలుస్తా.. చెప్పకనే చెప్పిన విజయ్

రాజకీయాల్లోకి వస్తా గెలుస్తా.. చెప్పకనే చెప్పిన విజయ్


దేశంలో రాజకీయాలు, సినిమాలు బాగా కలిసిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఉన్నారు కానీ.. తమిళనాట అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే చాలా ఏళ్లు అధికారం చలాయించారు. చలాయిస్తున్నారు. యం.జి.ఆర్, కరుణానిధి, జయలలిత.. ఎలా తమిళ రాజకీయాలను ప్రభావితం చేశారో.. అధికారం చలాయించారో తెలిసిందే.

ఈ కోవలో విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టారు కానీ.. అనుకున్నంతగా విజయవంతం కాలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి.. అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. ఇక అందరి చూపూ విజయ్ మీదే ఉంది. కొంత కాలంగా తాను రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలను బలంగా పంపుతున్నాడు విజయ్.

తాజాగా ‘లియో’ సక్సెస్ మీట్ చూసిన వాళ్లకు ఇంకా స్ట్రాంగ్ ఇండికేషన్స్ కనిపించాయి. తాను జనాలను నడిపించే దళపతిని అవుతా అంటూ తన ప్రసంగాన్ని ముగించేటపుడు అన్న మాట రాజకీయారంగేట్రం సంకేతాలను బలంగా ఇచ్చింది. దీని కంటే కూడా స్టేజ్ మీద యాంకర్ అడిగిన ఒక ప్రశ్న అందరి దృష్టినీ ఆకర్షించింది. 2026 గురించి మీరేమంటారు అని యాంకర్ అడిగితే.. ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది. ఆ సంవత్సరమే తమిళనాడు తర్వాతి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ జవాబు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ముందు అతను దీనిపై సరదాగా స్పందించాడు. 2025 తర్వాత వచ్చే సంవత్సరం 2026 అన్నాడు. తర్వాత ఆ సంవత్సరం ఫుట్‌బల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. చివరగా యాంకర్ సీరియస్‌గా సమాధానం చెప్పండి అని అడిగితే.. ‘‘కప్పు ముఖ్యం బిగిలూ’’ అంటూ తన సినిమాలోని ఒక డైలాగ్ పేల్చాడు. సూటిగా సమాధానం చెప్పకపోయినా.. ఎన్నికల్లో బరిలోకి దిగడం, విజయం సాధించడం తన లక్ష్యం అనే సంకేతాలను విజయ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.