Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏమిటీ ‘యూనిట్ 61398’.. ప్రపంచానికి సైబర్ పీడ?

ఏమిటీ ‘యూనిట్ 61398’.. ప్రపంచానికి సైబర్ పీడ?


కర్రలు.. బరిశెలతో కొట్టుకోవటం అనాగరికం. విల్లులు.. బాణాలతోఒకరిపై అధిక్యత సాధించుకోవటం వందల ఏళ్ల క్రితం జరిగింది. క్షిపణులతో దాడి చేయటం కూడా పాత పద్దతే. కంటికి కనిపించకుండా.. ఎక్కడో ఉండి.. ప్రపంచంలో ఎక్కడికైనా సరే.. వెళ్లి కీలక సమాచారాన్ని తస్కరించటం.. వారి ఆయువుపై దెబ్బ తీయటం ఇప్పుడు కొత్త యుద్ధనీతి. అదే సైబర్ వార్. విలువైన డాక్యుమెంట్లను తస్కరించటం.. భద్రతా రహస్యాల్ని చేజిక్కించుకోవటం ద్వారా ప్రత్యర్థుల్ని అచేతనం అయ్యేలా చేయటం ఇప్పటి యుద్ధ పద్దతి.

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కోవిడ్ 19కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థల ఐటీ వ్యవస్థలపై సైబర్ దాడికి పాల్పడటం.. వారి కీలక సమాచారాన్ని తస్కరించే దుర్మార్గానికి పాల్పడిన వైనం తాజాగా తెర మీదకు వచ్చి సంచలనంగా మారింది. ఇలాంటి దరిద్రపుగొట్టు పనులు చేసేందుకు చైనా ఏకంగా పన్నెండు అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేసింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలోని పుడాంగ్ లోని రద్దీ కలిగిన ప్రదేశంలో పన్నెండు అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేసింది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. పన్నెండు అంతస్తులు ఉండే ఈ భవనాన్ని ‘‘యూనిట్ 61398’’ అని పిలుస్తారు.

ఇందులో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వీరంత అగ్రశ్రేణి హ్యాకింగ్ టీం. అమెరికా లాంటి అత్యున్నత సాంకేతికత ఉన్న దేశంలోనూ ఈ భవనం గురించి చెప్పినంతనే ఒక్కసారి ఉలిక్కిపడతారు. ఈ భవనంలోని కొన్ని టీంలు కేవలం భారత్ ను టార్గెట్ చేసుకొని పని చేస్తుంటాయి. విలువైన సమాచారాన్ని తస్కరించేందుకు అనుక్షణం తపిస్తూ ఉంటారు. ఈ యూనిట్ కు కామెంట్ క్రూ.. కామెంట్ పాండా.. జిఫ్ 89ఏ.. బైజాటియన్ కాండోర్ అనే పేర్లతోనే వ్యవహరిస్తుంటారు. ఇంతకీ దీన్ని కామెంట్ క్రూ అని ఎందుకు పిలుస్తారంటే.. వీరు చాలా సింఫుల్ గా సిస్టమ్స్ ను హ్యాక్ చేస్తారు.

తాము టార్గెట్ చేసిన కంపెనీకి చెందిన వెబ్ సైట్ కామెంట్ సెక్షన్ లో ఏదో ఒకటి పోస్టు చేస్తారు. దానికి స్పందించి.. సమాధానం ఇచ్చారా.. అంతే సంగతులు. వారి ఐపీ అడ్రస్ ను గుర్తించి.. దానిని హ్యాక్ చేస్తారు. అనంతరం కంపెనీ నెట్ వర్కులోకి జొరపడతారు. అందుకే.. దీన్ని కామెంట్ క్రూ అని వ్యవహరిస్తారు. ఈ ప్రత్యేక భవనంలోవెయ్యికి పైగా సర్వర్లు ఉంటాయని చెబుతారు. అమెరికాపై జరిగే సైబర్ దాడులకు పాల్పడే అన్ని ఐపీ అడ్రస్ లు ఇదే భవనంలో ఉన్నాయన్న విషయాన్ని ఇటీవల గుర్తించారు.

దీనికి సంబంధించిన 76 పేజీల సమాచారాన్ని కలిపి ఒక నివేదికగా సిద్ధం చేశారు. ఒకసారి అమెరికాకు చెందిన మీడియా సంస్థ సీఎన్ఎన్ టీం బయట నుంచి ఆ భవనాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. అక్కడి సెక్యురిటీ వారిని వెంటాడి మరీ.. పట్టుకున్నారు. అంతలా అప్రమత్తంగా ఉంటారు. ఈ భారీ హ్యాకింగ్ టీం కేవలం 20 రంగాలకు చెందిన కంపెనీలకు సంబంధించిన డేటానను మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేసేందుకు ఎత్తులు వేస్తూ ఉంటుంది.

రీసెర్చ్ బ్లూ ప్రింట్.. ఔషధ ఫార్ములాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సొంతం చేసుకునేందుకు తమ శక్తిసామర్థ్యాల్ని విపరీతంగా ఉపయోగిస్తుంటారు. ఇదెంత గుట్టుగా పని చేస్తుందనటానికి ఒక ఉదాహరణను చెబుతుంటారు. 2009లో కోకోకోలా కంపెనీ యువాన్ జ్యూస్ కంపెనీని 2.4 బిలియన్ డాలర్లు వెచ్చింది కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

అలాంటి వేళ.. ఈ హ్యాకింగ్ టీం కోకోకోలా కంపెనీ కంప్యూటర్ల నుంచి డీల్ వ్యూహాన్ని దొంగలించింది. దీంతో.. ఆ డీల్ ఆగిపోయింది. ఆ సందర్భంలో 6.5 టెరాబైట్ల సమాచారాన్ని కొల్లగొట్టిందంటే.. దీని సామర్థ్యం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. ఈ భారీ సమాచారాన్ని ఓకే సమయంలో చోరీ చేయటం మరో విశేషం. భారత్ లో జరిగే సైబర్ దాడుల్లో అత్యధికం (35 శాతం) ఈ భవనం నుంచే జరగుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. చూస్తుంటే.. భారతీయుల్లో ఎవరో ఒకరు పుణ్యం కట్టుకొని.. ఈ భవనంలోని సిస్టంల మీద సైబర్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తే తప్పించి.. దీనికి భయం అన్నది కలగదేమో?