Templates by BIGtheme NET
Home >> Cinema News >> నిజం వల్లే ‘ఒక్కడు’ మిస్సయిన గోపీచంద్

నిజం వల్లే ‘ఒక్కడు’ మిస్సయిన గోపీచంద్


మహేష్ బాబు సినీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన సూపర్. ఆ విలక్షణ పాత్రకు తనదైన శైలి విలక్షణ నటనతో ప్రాణం పోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓబుల్ రెడ్డి పాత్రకు మొదట గోపీచంద్ అయితే బాగుంటుందని దర్శకుడు గుణశేఖర్ అనుకున్నాడట. నిర్మాత ఎంఎస్ రాజు కూడా ఓకే అన్న తర్వాత మహేష్ బాబు అందుకు నో చెప్పాడట.

ఒక్కడు సినిమా చేస్తున్న సమయంలోనే మహేష్ బాబు మరో వైపు నిజం చిత్రంను చేస్తున్నాడు. నిజం సినిమాలో కూడా విలన్ గా గోపీచంద్ నటించిన విషయం తెల్సిందే. ఒకే సారి రెండు సినిమాల్లో ఆయనే విలన్ అయితే బాగోదేమో అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రను గోపీచంద్ వద్దకు కాకుండా ప్రకాష్ రాజ్ వద్దకు వెళ్లేలా చేశాడట. ఈ విషయం గతంలో పలు సందర్బాల్లో దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

నిజం సినిమాలో కూడా గోపీచంద్ విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నిజంతో పాటు ఒక్కడు చిత్రంలో కూడా విలన్ గా నటించి ఉంటే ఆయన కెరీర్ మరింత ఉన్నతంగా ఉండేదేమో అనేది కొందరు అభిప్రాయం. మొత్తానికి మహేష్ బాబు కాస్త డెప్త్ గా ఆలోచించి గోపీచంద్ ను ఒక్కడు సినిమా నుండి తప్పించాడేమో అనిపిస్తుంది. ఒక్కడు సినిమా సూపర్ హిట్ అవ్వడం ప్రకాష్ రాజ్ పాత్ర బాగా పండటంతో మహేష్ బాబు నిర్ణయం సరైనదే అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.