మహమ్మారి ప్రభావం సినీపరిశ్రమలపై అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఎప్పటి నుంచి షూటింగులు ప్రారంభించాలి? అన్నదానిపై స్టార్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలను కరోనా టెన్షన్స్ వదిలిపెట్టినట్టు లేదు. సెట్స్ లో ఏమాత్రం తేడా కొట్టినా యూనిట్ అంతటికీ పాకిపోయే రోగం కాబట్టి ఎంతో ఓపిగ్గా వేచి చూడాల్సి వస్తోంది.
ఇలాంటి కారణాలతోనే ఈపాటికే పూర్తవ్వాల్సిన చాలా సినిమాలు సందిగ్ధంలో పడిపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ పరిస్థితి ఆగమ్యగోచరం అయ్యింది. ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ఎప్పటికి పూర్తి చేయాలి? గ్రాఫిక్స్ సహా నిర్మాణానంతర పనులు ఎప్పటికి పూర్తి చేయాలి? అన్నది తేలడం లేదు. రాజమౌళి పూర్తి డైలమాలో ఉన్నారు. పైగా ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి తిరిగి కోలుకోవడంతో ఇకపైనా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ఆర్.ఆర్.ఆర్ లో తారక్ పై తెరకెక్కించాల్సిన కీలక యాక్షన్ ఎపిసోడ్స్ పెండింగులోనే ఉండిపోయాయి. అయితే ఇప్పట్లో రాజమౌళి సెట్స్ కెళ్లే మూడ్ లో ఉన్నారా? అంటే సందిగ్ధమే. అందుకే ఆర్.ఆర్.ఆర్ కోసం వేచి చూడకుండా త్రివిక్రమ్ తో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ నుంచే సెట్స్ కు వెళ్లే వీలుందట. నిజానికి జూన్ నుండి చిత్రీకరణకు వెళ్ళవలసి ఉండగా.. కోవిడ్ సంక్షోభం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇంత గ్యాప్ వచ్చేసినా.. ఇప్పటికైనా త్రివిక్రమ్ తో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి చేసేస్తే సమయం ఆదా అవుతుందని తారక్ భావిస్తున్నారట. ఈ ఏడాది ముగియడానికి ఇంకో నాలుగు నెలల సమయం ఉంది. ఈలోగానే పని పూర్తయితే బావుంటుందన్నది ఆలోచన. ఇక రాజమౌళి 2021లోనే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు వెళతారన్న వార్తల నడుమ తారక్ కి లైన్ క్లియరైనట్టేనేమో..