Templates by BIGtheme NET
Home >> Telugu News >> బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!

బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!


అక్రమార్కులు మనదేశంలోనే కాదు.. అన్ని చోట్ల ఉన్నారు. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ ప్రభుత్వాలకు సవాలు విసురుతుంటారు. పెరూ దేశంలోని అమెజాన్ చిత్తడి అడవులు బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ కొందరు అనుమతులు తీసుకొని బంగారాన్ని తవ్వుతుంటారు. ఈ బంగారు గునుల్లో పనిచేస్తూ ఎందరో కార్మికులు జీవనోపాధి కూడా పొందుతుంటారు. అయితే అమెజాన్ అడవుల్లోని బంగారంపై అక్రమార్కులు కన్నేశారు. అడవిలోని కొద్ది ప్రాంతానికి మాత్రమే వాళ్లు అనుమతులు తీసుకుంటారు. ఈ తర్వాత విచ్చలవిడిగా బంగారాన్ని తవ్వేసుకొని సొమ్ముచేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగే అక్రమాలను నాసా బయటపెట్టింది.

పెరూలోని అమెజాన్ అడవుల్లో బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు చూస్తే మనకు కనిపిస్తుంది. ఈ చిత్రంలో కనిపించే నదుల్లాంటి ప్రాంతమంతా బంగారం కోసం తవ్విందే. సాధారణంగా బంగారం తవ్వే వాళ్లు నాసాకు చిక్కకుండా బంగారం తవ్వకాలు జరిగే ప్రాంతాలు ఆకాశం నుంచి కనిపించకుండా దాచేస్తారు. సూర్యుడి వెలుతురు ప్రతిబింబించేలా ఆ గుంటల్లో నీళ్లు నింపి శాటిలైట్ ఫొటోలకు చిక్కకుండా చేస్తారు. వ్యోమగామి ఈ ఫొటోలను గుర్తించారు. ఇక్కడ బంగారం అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన నిర్ధారించారు.

ఆగ్నేయ పెరూలోని మాడ్రే డీ డియోస్ ప్రాంతంలో బంగారం తవ్వకాల వల్ల అడవుల్లో జరుగుతున్న విధ్వంసానికి ఈ ఫొటోలు నిదర్శనంగా నిలిచాయి. ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో ఏర్పడిన గుంటలు నీళ్లతో నిండిపోయి పైకి కొన్ని వందల పళ్లాల్లా కనిపిస్తున్నాయి. ఆ తవ్వకాలు జరిగే చుట్టుపక్కల చెట్లను కూడా భారీగా కొట్టేశారు.