Templates by BIGtheme NET
Home >> Telugu News >> ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం: జియో టాప్‌

ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం: జియో టాప్‌


దేశంలో అయిదేళ్ల తర్వాత మళ్లీ రేడియో తరంగాల (స్పెక్ట్రమ్‌) వేలం మంగళవారం జరిగింది. స్పెక్ట్రమ్‌ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్‌ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ రూ.18,669 కోట్ల బిడ్లు దాఖలు చేయగా, వొడాఫోన్‌-ఐడియా రూ.1,993 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను ఏడు బాండ్లలో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. వీటిలో అత్యధికంగా రిలయన్స్‌ జియో దక్కించుకుంది.

రూ.18,669 కోట్ల విలువైన రేడియో తరంగాలను దక్కించుకున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. సబ్‌ గిగా హెర్జ్ట్‌ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్‌ బ్యాండ్‌‌, 2300 మెగాహెర్జ్ట్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని తెలిపింది. సబ్‌ గిగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌తో దేశవ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించేందుకు వీలు కలిగిందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. కొత్తగా 9 కోట్ల మంది వినియోగదారులను చేర్చుకోనున్నామని పేర్కొంది. అలాగే ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్‌వర్క్‌ చొచ్చుకువెళ్లేందుకు అవకాశం లభిస్తుందంది. గ్రామీణ ప్రాంతాలకూ మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్‌ దోహదం చేస్తుందని తెలిపింది. ధరలు అధికంగా ఉండడం వల్లే 700 మెగా హెర్జ్ట్‌ బ్యాండ్‌కు ఎవరూ బిడ్‌లు దాఖలు చేయలేదని పేర్కొంది.

మరోవైపు, ఐదు సర్కిళ్లలో తాము దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ 4జీ కవరేజ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేయనుందని మరో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌) పేర్కొంది. దీంతో తమ వినియోగదారులకు మరింత నాణ్యమైన డిజిటల్‌ సేవల్ని అందించేందుకు అవకాశం లభించనుందని పేర్కొంది. ఒకప్పుడు స్పెక్ట్రమ్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌ ఇప్పుడు మిగులు స్పెక్ట్రమ్‌ దేశంగా అవతరించిందని తెలిపింది. దీని వెనుక ప్రభుత్వ కృషి ఉందని కొనియాడింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా లక్ష్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని తెలిపింది. ఈ వేలంలో 5జీ సేవల కోసం గుర్తించిన 3300-3600 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్లను కలపలేదు. విజయవంతమైన బిడ్డర్లు ఒకేసారి బిడ్‌ మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదా తొలుత నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి.. మిగతా డబ్బును రెండేళ్ల మారటోరియం అనంతరం గరిష్ఠంగా 16 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు వినియోగించుకోవచ్చు.