Templates by BIGtheme NET
Home >> Telugu News >> నవంబర్ 30 వరకు అన్ లాక్ 5 మార్గదర్శకాలే పొడగింపు : కేంద్రం

నవంబర్ 30 వరకు అన్ లాక్ 5 మార్గదర్శకాలే పొడగింపు : కేంద్రం


దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్ లాక్ 5 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆ మార్గదర్శకాలే నవంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తాయని నేడు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాళ్లు స్విమ్మింగ్ పూల్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాలను షరతులతో ఓపెన్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్గదర్శకాలను నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్లు ఈ రోజు కేంద్రం హోంశాఖ స్పష్టం చేసింది.

అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్ డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది. విద్యార్థుల హాజరు విషయంలో పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది.

కంటేన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని చెప్పింది. ఆ రాకపోకలకు ఎటువంటి పర్మిషన్-అనుమతి అవసరం లేదు. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ సెప్టెంబర్ 30వ తేదీన కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సినిమాహాళ్లను తెరిచాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు మత్రం థియేటర్లను తెరవలేదు.