Templates by BIGtheme NET
Home >> Cinema News >> సినిమా టీవీ షూటింగులపై సమాచార శాఖ షాకిచ్చే ప్రకటన

సినిమా టీవీ షూటింగులపై సమాచార శాఖ షాకిచ్చే ప్రకటన


నాలుగైదు నెలలుగా సినిమా/ టీవీ రంగంలో షూటింగులు లేక కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. బతుకు తెరువు లేక ధైన్యం నెలకొంది. ఇలాంటి సన్నివేశంలో పలు ఇండస్ట్రీల్లో అన్ లాక్ ప్రక్రియలో షూటింగులకు అనుమతులిచ్చేశారు. ఇప్పటికే టాలీవుడ్ లో కొందరు షూటింగులు చేసుకుంటున్నారు. సీరియల్ షూటింగులు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త పడుతున్నారు. బిగ్ బాస్ షూటింగుకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే మహమ్మారీ తీవ్రత దృష్ట్యా ఎవరికి వారు స్వచ్ఛందంగా షూటింగులకు వెళ్లడం లేదు. తెలుగులో ఏ అగ్ర హీరో ఇంతవరకూ సెట్స్ పైకి అడుగు పెట్టకపోవడం షాకిస్తోంది. చాలా సీరియళ్ల షూటింగుల విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నా కొందరు ధైర్యం చేసి చిత్రీకరణలు సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగానే.. తాజాగా అన్ లాక్ 4.0 నిర్ధేశకాల ప్రకారం.. నిరవధికంగా షూటింగులు జరుపుకోవచ్చని అయితే కండీషన్స్ అప్లయ్! అంటూ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ నుంచి ప్రకటన వెలువడింది. మహమ్మారీతో సహజీవనం సినిమావాళ్లకు తప్పదని చెప్పకనే చెప్పింది ఈ ప్రకటన. సినిమాలు.. టీవీ సీరియళ్ల చిత్రీకరణకు ఎలాంటి అభ్యంతరాల్లేవని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన జారీ చేశారు. రూల్స్ పాటిస్తూ చిత్రీకరణను జరుపుకోవచ్చని .. తాజా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని ఆయన విడుదల చేశారు.

కొత్త నియమాల ప్రకారం.. భౌతిక దూరం మాస్క్ తప్పనిసరి. కెమెరా ముందు నటించేవాళ్లు మినహా ఇతరులంతా సెట్స్ లో మాస్క్ ధరించాల్సిందే. నటీనటులు అయినా పక్కకు వచ్చాక మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఆన్ లొకేషన్ శానిటైజర్లను ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. పొరపాటు జరిగితే అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జవదేకర్ హెచ్చరించారు. ఆసక్తికరంగా ఈ పునరుద్ధరణ ఆర్థిక వ్యవస్థకు సంజీవని అంటూ.. అలాగే సినిమా రంగం ఆర్థిక వ్యవస్థకు ఓ సంజీవని లాంటిదని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరం. కొత్త రూల్స్ తో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటించక తప్పదని చెప్పారు. కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించేంత వరకూ వాటిని పాటించాల్సి ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు.