ఏపీ సీఎం జగన్ తో ఫైట్ చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల మిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నందున ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సిద్ధం కావాలన్నారు.
ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియకు వెళ్తామన్నారు. కోర్టు క్లియరన్స్ వచ్చాకే ఎన్నికలకు వెళతామని తెలిపారు.
ప్రభుత్వంతో చర్చించాక షెడ్యూల్ ఖరారు చేస్తామని వెల్లడించారు. కొత్త జిల్లాలు జనవరిలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.